ఏపీలో ఇవాళ్టి నుంచే డీఎస్సీ పరీక్షలు..నిమిషం ఆలస్యమైతే అంతే
ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి.
By Knakam Karthik
ఏపీలో ఇవాళ్టి నుంచే డీఎస్సీ పరీక్షలు..నిమిషం ఆలస్యమైతే అంతే
ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఆన్లైన్ విధానంలో ఈ పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ సర్వం సిద్ధమైంది. ఈనెల 6 నుంచి జూన్ 30 వరకు జరగనున్న పరీక్షలకు మొత్తం 154 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రోజుకు రెండు విడతలుగా పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీకి 3,35,401 మంది నుంచి 5,77,417 దరఖాస్తులు పోటెత్తాయి. ఇంతవరకు 3.04 లక్షల మంది హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ వెబ్సైట్లో పొందుపరిచింది. మొత్తం పరీక్షలు పూర్తయిన తర్వాత మరుసటి రోజు ప్రాథమిక ‘కీ’ విడుదల చేయనున్నారు. అభ్యంతరాల స్వీకరణకు వారం గడువు ఇచ్చి, అనంతరం తుది ఆన్సర్ కీ రూపొందిస్తారు.
అటు పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని, పరీక్షా కేంద్రానికి 90 నిముషాల ముందు చేరుకోవాలని డీఎస్సీ కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి ప్రకటించడంతో అభ్యర్థులు అప్రమత్తమయ్యారు. అభ్యర్థుల హాల్టికెట్లలో ఏమైనా తప్పులు ఉంటే ప్రభుత్వం జారీ చేసిన ఆధార్, ఓటరు ఐడీ, పాన్ తదితర గుర్తింపు కార్డులను పరీక్ష కేంద్రాల వద్ద సమర్పిస్తే… అక్కడి అధికారులు వాటిని సరి చేసేలా ఏర్పాటు చేశారు. హాల్ టికెట్లో ఫొటో లేకపోతే… అటువంటి అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి రెండు ఫొటోలు తీసుకురావాలి. పరీక్షా కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు అంటే.. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, పెన్ డ్రైవ్లు, బ్లూటూత్ పరికరాలను నిషేధించారు. ఇ-అడ్మిట్ కార్డు ప్రింటవుట్, గుర్తింపు కార్డు, అడ్మిట్ కార్డులో ఫొటో లేకుంటే 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకువెళితే సరిపోతుంది. ఆన్ లైన్లో ప్రతి పరీక్ష 2.30 గంటలపాటు ఉంటుంది. పరీక్షా కేంద్రాలలో 20 మంది అభ్యర్థులకు ఒకరు చొప్పున సాంకేతిక సహాయకులను నియమించారు.