నిరుద్యోగులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గుడ్న్యూస్
ఐటీఐతో పాటు పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థుల కోసం జాబ్ మేళాను నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు.
By అంజి
నిరుద్యోగులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గుడ్న్యూస్
అమరావతి: ఐటీఐతో పాటు పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థుల కోసం జాబ్ మేళాను నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. మూడు నెలలకో జాబ్ మేళా చొప్పున నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్టు వివరించారు. అటు టీవీ ఛానెల్లో అమరావతి వేశ్యల రాజధాని అంటూ వైసీపీ కామెంట్ చేయించిందని మండిపడ్డారు. ఇది ఆ ప్రాంత మహిళలను అవమానించడమేనని ఫైర్ అయ్యారు. ''ఐటీఐ,పాలిటెక్నికల్ చదివిన వాళ్లకి ప్రతి మూడు నెలలకి జాబ్ మేళా పెట్టాలని ఆలోచన ఉంది త్వరలోనే అమలు చేస్తాం'' ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.
ఆదివారం ఉదయం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న 325 మంది ప్రైవేటు ఎలక్ట్రీషియన్లతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. పని ప్రదేశాల్లో వారి రక్షణ, భద్రత కోసం సేఫ్టీ కిట్లను అందజేశారు. ఈ సేఫ్టీ కిట్ లో ఎలక్ట్రికల్ పనులకు అవసరమైన టూల్ కిట్, రబ్బర్ హాండ్ గ్లోవ్స్, షూస్, జాకెట్ ఉన్నాయి.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ''గత ఏప్రిల్ నెలలో పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో ఎలక్ట్రీషియన్ గా పని చేసే దళిత యువకుడు పల్లపు సురేష్ ప్రమాదవశాత్తు మరణించడం చాలా కలచి వేసింది. ఒకరి ఇంట్లో విద్యుత్ మరమ్మత్తు పనులు చేస్తూ విద్యుదాఘాతానికి గురై సురేష్ మరణించారు. ఆయన మరణంతో కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయి నిరాధారంగా మారింది. ఒక వైపు ప్రాణం కోల్పోయి ఆ కుటుంబం దుఃఖములో ఉంటే... మరోవైపు గ్రామంలో అనేక స్పర్ధలకు దారి తీసింది. రాజకీయ లబ్ధి కోసం ఆలోచించే వారు ఇలాంటి గొడవలను పెంచి పెద్దవిగా చేస్తారు. మేం మాత్రం ఇలాంటి సమస్యలను ఎలా పరిష్కరించాలి అని ఆలోచన చేస్తాము'' అని అన్నారు.