సింగపూర్‌కు అందుకే వచ్చా..సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

విదేశాల్లో స్థిరపడి...సంపద సృష్టిస్తున్న తెలుగు వాళ్లు జన్మభూమిని మరిచిపోకూడదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.

By Knakam Karthik
Published on : 27 July 2025 7:43 PM IST

Andrapradesh, SingaporeTelugusWelcomeCBN, AP at Singapore, CBN in Singapore

సింగపూర్‌కు అందుకే వచ్చా..సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

విదేశాల్లో స్థిరపడి...సంపద సృష్టిస్తున్న తెలుగు వాళ్లు జన్మభూమిని మరిచిపోకూడదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.ఐదు రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా తొలి రోజున ఆదివారం స్థానికంగా ఉన్న వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో తెలుగు డయాస్పొరా ఫ్రం సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ కార్యక్రమానికి సింగపూర్ సహా మలేషియా, థాయ్ ల్యాండ్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా దేశాల్లో స్థిరపడ్డ తెలుగు ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చంద్రబాబు ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని.. తన సింగపూర్ పర్యటన ఉద్దేశ్యాలను వివరించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రపంచంలో మారుతున్న పరిణామాలను తెలుగు ప్రజలు అందిపుచ్చుకున్నారు. నాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు తెలుగు ప్రజల జీవితాలను మార్చాయి. ప్రపంచవ్యాప్తంగా 120 పైగా దేశాల్లో తెలుగు ప్రజలు స్థిరపడ్డారు. ఏ దేశానికైనా వెళ్లి.. గట్టిగా తెలుగులో మాట్లాడితే అక్కడున్న తెలుగు వారు ఓ పది నిమిషాల్లోనే పోగయ్యే పరిస్థితి వచ్చేసింది. ప్రపంచంలోని చాలా దేశాలకు తెలుగు వాళ్లు వెళ్లడమే కాదు.. ఆయా దేశాల్లోని స్థానికులకంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు. అమెరికాలో ఉండే స్థానికులకంటే.. తెలుగు వారి తలసరి ఆదాయం చాలా ఎక్కువగా ఉంది. నాదెళ్ల సత్య లాంటి వాళ్లు మైక్రో సాఫ్ట్ లాంటి ప్రముఖ కంపెనీలకు సీఈఓలుగా ఉన్నారు. ప్రపంచంలోని చాలా కంపెనీలకు సేవలు అందిస్తూ.. మన తెలుగు వాళ్లు వివిధ దేశాల్లో స్థిరపడ్డారు. సింగపూర్ లో 40 వేల మంది తెలుగు వాళ్లు నివాసం ఉంటున్నారు. తెలుగు వాళ్లు ఏయే దేశాల్లో స్థిర పడ్డారో.. ఆ దేశం వారికి కర్మభూమి..అవకాశాలు కల్పించిన ఆ దేశాభివృద్ధి కోసం పని చేయాలి. అదే సమయంలో పుట్టిన గడ్డను తెలుగు వాళ్లు మరువ కూడదు. భారతదేశం.. ఆంధ్రప్రదేశ్ వారి జన్మభూమి. ఆ జన్మభూమి అభివృద్ధి కోసం తెలుగు వాళ్లు పని చేయాలి. పెట్టుబడులు పెట్టాలి. అక్కడి పేదలకు చేయూత అందించాలి. భారత దేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు కట్టిన పన్నులతో మీరు ఈ స్థాయికి ఎదిగారు.. ఎన్నో అవకాశాలు పొందారు. కాబట్టి జన్మభూమి అభివృద్ధికి కృషి చేయడం.. పెట్టుబడులు పెట్టడం అనేది బాధ్యతగా తీసుకోవాలి. నేను ఏ దేశం వెళ్లినా... అక్కడి తెలుగు వారిని తప్పకుండా కలుస్తాను.” అని సీఎం చెప్పారు.

సింగపూర్ దేశం అంటే నాకు చాలా అభిమానం.. గౌరవం. నీతి, నిజాయితీలకు సింగపూర్ దేశం నిలువెత్తు నిదర్శనం. ఈ దేశంలో అవినీతి తక్కువ. సింగపూర్ రోడ్ల మీద ఒక్క కాగితం ముక్క కూడా కన్పించదు. చాలా కాలం క్రితమే చెత్తను కూడా ఎనర్జీగా కన్వెర్ట్ చేసే విధానాన్ని సింగపూర్ ఆచరణలో పెట్టింది. అదే తరహా విధానాన్ని హైదరాబాద్ నగరంలో అమలు చేశాను. చాలా మంది రాజకీయ నేతలు సింగపూర్ వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తారు.. కానీ ఏపీ సీఎం మాత్రం ఇక్కడికి వచ్చి తాను చేసిన మంచి పనులను అమలు చేస్తున్నారని సింగపూర్ దేశ మాజీ ప్రధాని లీ క్వాన్ యూ చెప్పారు. ఇలాంటి సింగపూర్ ప్రభుత్వంతో ఏపీకి గ్యాప్ వచ్చింది. నేను అడిగిన వెంటనే ఉచితంగా అమరావతి కోసం మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి సింగపూర్ ప్రభుత్వం అంగీకరించింది. సింగపూర్ ప్రభుత్వం చాలా దేశాల్లో టౌన్ షిప్ లు కట్టింది. కాబట్టి సీడ్ క్యాపిటల్ నిర్మాణం సింగపూర్ ప్రభుత్వానికే అప్పగించాను. కానీ 2019లో ప్రభుత్వం మారి సింగపూర్ ను తప్పు పట్టే పరిస్థితి తీసుకువచ్చారు. వాటిని సరిదిద్ది.. రికార్డులు సరి చేయడానికే సింగపూర్ వచ్చాను. ఏపీ బ్రాండును సింగపూర్ లో తిరిగి నెలకొల్పడానికే వచ్చాను. మన రాష్ట్రంలో ఏ ఒక్కరు తప్పు చేసినా.. తెలుగు వాళ్లే చేశారంటారు. ఆ అభిప్రాయాన్ని సింగపూర్ ప్రభుత్వంలో.. సింగపూర్ కంపెనీల్లో తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాను. సింగపూర్ కు కలిగిన అసౌకర్యానికి బాధపడుతున్నానని వారికి చెబుతున్నాను. సింగపూర్ ప్రభుత్వం మళ్లీ సీడ్ క్యాపిటల్ నిర్మాణానికి ముందుకు రాకపోవచ్చు. జరిగిన వాస్తవాలను మాత్రం వారికి తెలియచేస్తాను. 2019లో కూడా మన ప్రభుత్వమే కొనసాగి ఉంటే.. అమరావతి సింగపూర్ స్థాయికి చేరేది. కానీ 2019 ఎన్నికల్లో గ్యాప్ వచ్చింది. మళ్లీ ఇలాంటి పొరపాట్లు రాకుండా చూసుకోవాలి. ఈ బాధ్యత నా మీదే కాదు..మీ మీద కూడా ఉంది.” అని చంద్రబాబు భావోద్వేగంగా స్పందించారు.

Next Story