పన్ను ఎగవేతలకు AIతో చెక్ పెట్టండి : చంద్రబాబు

పన్నుల వసూళ్లు పెరిగేలా ఆదాయార్జన శాఖలన్నీ పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు

By Knakam Karthik
Published on : 9 April 2025 5:15 PM IST

Andrapradesh, Chief Minister Chandrababu, revenue departments

పన్ను ఎగవేతలకు AIతో చెక్ పెట్టండి, ఆదాయ వనరులు పెరిగితేనే అసలైన వృద్ధి: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా, సొంతంగా ఆదాయం పెంచుకునేలా, పన్నుల వసూళ్లు పెరిగేలా ఆదాయార్జన శాఖలన్నీ పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మరిన్ని ఆదాయ మార్గాలను వెతకడంతో పాటు, ఎక్కడ ఆదాయం తక్కువుగా నమోదవుతుందో దానికి గల కారణాలను వెతికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. పన్నుల చెల్లింపుల దగ్గర నుంచి రశీదులు, నోటీసులు జారీ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లో జరగాలని చెప్పారు. బుధవారం సచివాలయంలో ఆదాయార్జన శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

పన్నుఎగవేతలు ఉండకూడదు

మున్సిపల్ శాఖ ఇచ్చిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల ద్వారా రాష్ట్రంలో వెయ్యి మందికి పైగా బిల్డర్లు అసలు రిజిస్టర్ కాలేదని ఏఐ గుర్తించింది. అయితే, తప్పనిసరిగా జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే ప్రభుత్వం ఎటువంటి ఆమోదాలైనా తెలపాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. పన్ను ఎగవేతదారులను పసిగట్టేందుకు ఏఐని వినియోగించుకోవాలని చెప్పారు. అన్ని ఆదాయార్జన శాఖల్లోనూ ఇదే తరహా ప్రక్రియ అమలు చేసి పకడ్బందీగా పన్ను వసూళ్లు చేయాలన్నారు. టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా వ్యాపారులకు పన్ను చెల్లింపులు, అనుమతులు వంటివి సులభతరం అవుతున్నాయనే విషయాన్ని వారికి తెలియజేయాలన్నారు.

గత ప్రభుత్వంలా వ్యాపారులను వేధించడం కూటమి ప్రభుత్వ విధానం కాదని... వారితో సమన్వయం చేసుకుంటూ నిబంధనల ప్రకారం రావాల్సిన పన్నులన్నీ చెల్లించేలా చూడాలని ముఖ్యమంత్రి అన్నారు. పన్నుచెల్లింపుదారులు, జీఎస్టీ పోర్టల్, ఏపీ రాష్ట్ర డేటా సెంటర్, ఏపీసీటీడీ... ఇలా మొత్తం శాఖల సమాచారాన్ని ఏఐతో అనుసంధానించాలని ముఖ్యమంత్రి చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు నోటీసుల జారీకి, గ్రీవెన్స్‌లు స్వీకరించడానికి ఏఐని వినియోగించి ప్రభుత్వ యంత్రాంగంలో మరింతం వేగం పెంచవచ్చని సూచించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రాష్ట్ర సొంత ఆదాయ లక్ష్యం రూ.1,37,412 కోట్లను 100 శాతం ఆర్జించేలా అన్ని శాఖలు కృషి చేయాలని చెప్పారు.

రాష్ట్ర సొంత ఆదాయంలో 2.2 శాతం వృద్ధి :

2023-24 ఆర్ధిక సంవత్సరంతో పోల్చుకుంటే 2024-25కి గాను రాష్ట్రానికి సొంతంగా ఆదాయంలో 2.2శాతం వృద్ధి నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో వృద్ధి 4.1 శాతం పెరగ్గా, పన్నేతర ఆదాయం మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. జీఎస్టీలో 4.9శాతం వృద్ధి, ప్రొఫెషనల్ ట్యాక్స్‌లో 15.2శాతం వృద్ధి, ఎక్సైజ్ ఆదాయంలో 24.3 శాతం వృద్ధి నమోదైంది.

నూతన ఎక్సైజ్ పాలసీ సక్సెస్ :

కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకటించిన దగ్గర నుంచి ఆదాయాన్ని పరిశీలిస్తే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గతం కన్నా మెరుగుపడింది. అక్టోబర్ 2024 నుంచి మార్చి 2025 వరకు రూ. 4,330 కోట్ల ఆదాయం రాగా, దాదాపు 33 శాతం ఎక్సైజ్ ఆదాయం పెరిగింది. అలాగే, మున్సిపల్ శాఖలో 2023-24 కంటే 2024-25లో రూ.500 కోట్లకు పైగా ఆదాయం అదనంగా వచ్చింది. పన్నులకు సంబంధించి ఇంకా సుమారు రూ.2,500 కోట్ల బకాయిలు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆస్తులకు సంబంధించిన పన్నులు, అలాగే, ఖాళీ స్థలాల పన్నులు అధికంగా వసూలు కావాల్సి ఉన్నాయి. మార్చి నెలలో ప్రకటించిన 50 శాతం వడ్డీ రాయితీ ప్రకటించడంతో కేవలం 6 రోజుల్లోనే మొత్తం ఆస్తిపన్నులు రూ.240 కోట్లు వసూలయ్యాయని అధికారులు చెప్పారు.

Next Story