అమరావతి: 16,347 ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్న మెగా డీఎస్సీలో భాగంగా ఈ నెల 14న జరిగిన పీజీటీ వృక్షశాస్త్రం, 17న జరిగిన జంతుశాస్త్రం ఇంగ్లీష్ మీడియం పరీక్షల ప్రాథమిక కీ విడుదల అయ్యింది. ఈ ప్రాథమిక కీలపై ఈ నెల 29లోపు అభ్యంతరాలను తెలియజేయాలని కన్వీనర్ కృష్ణారెడ్డి సూచించారు. అలాగే ఈ పరీక్షల రెస్పాన్స్ షీట్లను కూడా ఇవాళ్టి నుంచి అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
అటు ఇప్పటికే గణితం సబ్జెక్టుకు సంబంధించిన ఆన్లైన్ రాత పరీక్షల ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ని వెబ్సైట్లో పొందుపరిచింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్ధుల రెస్పాన్స్షీట్స్ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. మెగా డీఎస్సీ పరీక్షలు ఏపీతో సహా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. మెగా డీఎస్సీలో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,36,305 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కొక్కరు 3, 4 పోస్టులకు దరఖాస్తు చేయడంతో దరఖాస్తులు దాదాపు 5,77,675 వరకు వచ్చాయి. జులై 2 వరకు డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి.