శ్రీ సత్యసాయి జిల్లాలోని నల్ల చెరువు మండల కేంద్రంలో శుక్రవారం క్రికెట్ మైదానంలో క్షుద్ర పూజలు (తాంత్రిక పూజ) జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గత నాలుగు రోజులుగా మైదానంలో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుండగా, క్రికెట్ మైదానంలోని ఒక దగ్గర ముగుళ్లు, నిమ్మకాయలు, గుడ్లు ఉంచి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం స్టేడియానికి వచ్చిన క్రీడాకారులు అక్కడి దృశ్యాలు చూసి ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గులు వేసి, వాటి మధ్యలో నిమ్మకాయలు, కోడిగుడ్లు పెట్టి పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. మైదానంలో క్షుద్ర పూజలు చూసి ఆటగాళ్ళు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో ఆటగాళ్ళు మైదానంలోకి వచ్చి ఆడేందుకు జంకుతున్నారు. దీంతో స్థానిక మ్యాచ్లను కొన్ని గంటలపాటు నిలిపివేశారు. ఉత్సాహంగా సాగుతున్న టోర్నమెంట్ను ఆపేందుకే కొందరు ఆకతాయిలు ఈ చర్యకు పాల్పడి ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దుండగులు నల్ల చెరువు వద్ద ఒక మొబైల్ దుకాణం ముందు కూడా ఇలాంటి క్షుద్రపూజలు చేశారని స్థానికులు చెబుతున్నారు.