ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా టీడీపీ కృషి చేస్తోంది: చంద్రబాబు

శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు.

By Srikanth Gundamalla
Published on : 29 March 2024 12:30 PM IST

andhra pradesh, tdp, chandrababu, nara lokesh tweet,

 ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా టీడీపీ కృషి చేస్తోంది: చంద్రబాబు 

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. యాత్రలో భాగంగా ఆయన జిల్లాల పర్యటన చేస్తున్నారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత కేక్‌ కట్‌ చేసి కార్యకర్తుల, నాయకులకు తినిపించారు.

ఈ సందర్భంగా టీడీపీని ఉద్దేశించి ప్రసంగించిన చంద్రబాబు.. పలు కామెంట్స్ చేశారు. రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదనీ.. ప్రజలకు సేవ చేయడం అని చెప్పారు. దీన్ని ఎన్టీఆర్ నిరూపించారని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన్ని కొనియాడారు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్, జ్యోతిబా పూలే వంటి మహానీయుల స్ఫూర్తితో 1982లో ఇదే రోజున ఎన్టీఆర్ టీడీపీని ప్రకటించారని చెప్పారు. బుడుగు, బలహీన వర్గాల ప్రజలు కేవలం ఓటర్లుగా మిగిలిపోవద్దని ఎన్టీఆర్ చెప్పారని అన్నారు. వారు రాజీయాలను శాసించే స్థాయికి వెళ్లాలనే ఉద్దేశంతో పార్టీ, ప్రభుత్వంలో ఆయన కీలక బాధ్యతలను కూడా ఇచ్చారని చంద్రబాబు అన్నారు. నాటి నుంచి ఇప్పటి వరకు ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా టీడీపీ పని చేస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక ముందు కూడా ఇదే అంకితభావంతో ముందుకు వెళ్తామని చంద్రబాబు చెప్పారు.

ఇక పార్టీ ఆవిర్బావం సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ట్వీట్ చేశారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం టీడీపీ పుట్టిందని అన్నారు. అణగారిన వర్గాలకు అండగా ఉంటామని చెప్పారు. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అన్న ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం శ్రమిస్తున్నట్లు నారా లోకేశ్‌ ట్వీట్ చేశారు.


Next Story