ఏపీలో స్కూళ్లకు వేసవి సెలవులు.. ఎప్పటినుంచి అంటే..
ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 24వ తేదీ నుంచి పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్నాయి.
By Srikanth Gundamalla Published on 2 April 2024 12:26 PM IST
ఏపీలో స్కూళ్లకు వేసవి సెలవులు.. ఎప్పటినుంచి అంటే..
ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. జనాలు ఇళ్ల నుంచి కాలు బయటపెట్టాలంటేనే భయపడిపోతున్న పరిస్థితులు. వృద్ధులు, చిన్నపిల్లలను బయటకు వెళ్లనివ్వడం లేదు. అంతేకాదు.. చాలా వరకు ప్రజలు ఉదయం, సాయంత్రం వేళనే పనులను పెట్టుకుంటున్నారు. ఇక ఎండలు పెరుగుతున్న క్రమంలో ఏపీ ప్రభుత్వం స్కూళ్లకు వేసవి సెలవులను ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 24వ తేదీ నుంచి పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు స్కూళ్ల విభాగం కార్యదర్శి సురేశ్ కుమార్ పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి. ఏపీ వ్యాప్తంగా ఏప్రిల్ 23వ తేదీ నాటికి అన్ని తరగతుల విద్యార్థులకు పరీక్షలు పూర్తి చేసి.. మార్చి 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ ప్రకటన చేసింది. ఇక వచ్చే అకడమిక్ ఇయర్ కోసం జూన్ 12న తిరిగి స్కూళ్లు తెరుచుకుంటాయని స్కూళ్ల విభాగం కార్యదర్శి సురేశ్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొత్తం 50 రోజుల పాటు విద్యార్థులకు సెలవులు రానున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మార్చి 18వ తేదీ నుంచి ఎండల కారణంగానే ఒంటిపూట బడులు నిర్వహిస్తోంది ప్రభుత్వం. అప్పటి నుంచి ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు.