అమరావతి నిర్మాణానికి తొలి నెల వేతనం విరాళంగా ఇచ్చిన మంత్రి రామ్ ప్రసాద్రెడ్డి
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.
By Srikanth Gundamalla Published on 13 Aug 2024 9:00 AM IST
అమరావతి నిర్మాణానికి తొలి నెల వేతనం విరాళంగా ఇచ్చిన మంత్రి రామ్ ప్రసాద్రెడ్డి
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. 2019లో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ చెప్పింది. దాంతో.. అమరావతి రాజధాని నిర్మాణం ఇక ముగిసిపోయిందని అనుకున్నారు. అయితే.. కూటమి ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది. దాంతో.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. దాంతో.. అమరావతిపై ఉన్న నీలి నీడలు తొలగిపోయాయి. గడిచిన ఐదేళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పుడు పనులు ప్రారంభం అయ్యాయి. కేంద్రం రూ.15వేల కోట్లు కేటాయించడం.. చకచకా పనులు సాగుతుండటంతో మార్గం సుగమం అయ్యింది. జంగిల్ క్లీయరెన్స్ తో రాజధాని ప్రాంతంలో నిర్మాణం వేగం పుంజుకుంది.
ఇక అమరావతి రాజధాని నిర్మాణం కోసం ప్రజలు, వివిధ పార్టీ శ్రేణులు, ప్రముఖులు, సంస్థలు విరాళాలు అందజేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి తన మొదటి నెల వేతనం మొత్తం రాజధాని నిర్మాణం కోసం విరాళంగా అందజేశారు. 1,01,116 రూపాయలను సీఎం చంద్రబాబుకి అందించారు. సచివాలయంలో చంద్రబాబుని కలిసిన మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి.. చెక్కును అందజేశారు. రాజధాని నిర్మాణ కోసం విరాళం ఇచ్చేందుకు ముందుకొచ్చిన మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డిని సీఎం చంద్రబాబు అభినందించారు. తన విరాళం గురించి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలిపారు. దాంతో. టీడీపీ శ్రేణులు, అభిమానులు కూడా ఆయన్ని అభినందిస్తున్నారు.