ఏపీకి భారీగా కొత్త ఐపీఎస్‌లు.. కేడర్‌ పెంపు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వత కేంద్రానికి కీలక విజ్ఞప్తి పెట్టింది.

By Srikanth Gundamalla  Published on  27 July 2024 8:30 AM GMT
Andhra Pradesh, government, ips cadre, strength increased,

ఏపీకి భారీగా కొత్త ఐపీఎస్‌లు.. కేడర్‌ పెంపు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వత కేంద్రానికి కీలక విజ్ఞప్తి పెట్టింది. ఐపీఎస్ కేడర్‌ను పెంచాలని కోరింది. దాంతో.. కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఐపీఎస్‌ కేడర్‌ సంఖ్యను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే భారీగా ఏపికి కొత్త ఐపీఎస్‌లు రాబోతున్నారు. ప్రస్తుతం 144 మంది ఐపీఎస్‌లు ఉండగా.. వారి సంఖ్యను 174కి పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర డిప్యుటేషన్‌ రిజర్వ్‌గా 38 మంది ఐపీఎస్‌లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్రాలకు డిప్యుటేషన్‌ రిజర్వ్‌గా 23 మందిని కేటాయించింది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి 144 మంది ఐపీఎస్‌లను కేటాయించారు. కానీ.. ఐపీఎస్‌ అధికారులు ఏపీకి సరిపోలేదు. పైగా గతంలో వైసీపీ ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చింది. దీంతోపాటు నిఘా వ్యవస్థ విభాగాల్లో, క్రైమ్‌ విభాగాల్లో పోలీసు అధికారుల కొరత తీవ్రంగా మారింది.ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌కు ఐపీఎస్‌ల సంఖ్య పెంచాలని కోరారు. కేంద్రానికి అప్పుడే జగన్‌ లేఖ కూడా రాశారు. అప్పుడు కేంద్రం నుంచి స్పందన లేదు. కూటమి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత.. కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా మారింది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు ఐపీఎస్‌ల కొరత గురించి మరోసారి ప్రస్తావించారు. హోంమంత్రి అమిత్‌షా అన్ని విషయాలను చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత నాలుగైదు సంవత్సరాల అనుభవం ఉన్న జూనియర్‌ ఐపీఎస్‌లనే ఎస్పీలుగా నియమించాల్సి వస్తుందని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతోందనీ.. ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పారు. సీఎం చంద్రబాబు వినతిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఏపీలో ఐపీఎస్‌ కేడర్‌ను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story