ఏపీ ప్రజలకు గుడ్న్యూస్..ఫ్రీ బస్సు మహిళలతో పాటు వారికి కూడా..
ఏపీలో కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 1 Aug 2024 6:32 AM IST
ఏపీ ప్రజలకు గుడ్న్యూస్..ఫ్రీ బస్సు మహిళలతో పాటు వారికి కూడా..
ఏపీలో కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒకదాని తర్వాత మరోటి వెంట వెంటనే అమలు చేస్తోంది. అయితే.. రాష్ట్రంలో మహిళలు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న పథకం.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం. అయితే.. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మహిళలకు మాత్రమే కాకుండా.. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పెన్షన్లు అందుకునే వారికి కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని భావిస్తోంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్య సేవలను పొందేందుకు ఉచితంగా బస్ పాస్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. గుండెజబ్బులు, ఇడ్నీ, పక్షవాతం, లివర్, తలసేమియా, లెప్రసీ, సీవియర్ హీమోలిఫియా వంటి అనారోగ్య సమస్యలున్నవారికి ఫ్రీ బస్సు సదుపాయం కల్పించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
ఇలా రాష్ట్రంలో 51 వేల మందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా పింఛను ఇస్తోంది. వీరంతా వైద్య చికిత్సల కోసం ఆసుపత్రులకు వెళ్లి రావాల్సి ఉంటుంది. ఆస్పత్రికి వెళ్లి రావాలంటే వారికి అదనపు వ్యయప్రయాసలు తప్పడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 35 వేల మంది కిడ్నీ వ్యాధిగ్రస్థులు నెలకు ఒకటి, రెండుసార్లయినా ఆసుపత్రులకు వెళ్లాల్సి ఉంటుంది. వీరిలో పింఛను సదుపాయం కొద్ది మందికే ఉంది. కొందరు ఆసుపత్రికి వెళ్లేందుకు దూరాన్నిబట్టి వారు రూ.200 నుంచి రూ.600 వరకు వ్యయం అవుతోంది. అందుకే వీరికి ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అకాశం ఉందంటున్నారు.