తూర్పు గోదావరి జిల్లాలో కల్తీ పాలు తాగిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 13కి చేరడం తీవ్ర కలకలం రేపుతోంది. రాజమహేంద్రవరం లాలాచెరువు పరిధిలోని చౌడేశ్వరనగర్, స్వరూపనగర్ ప్రాంతాలకు చెందిన పలువురు నివాసితులు ఫిబ్రవరి 22 నుంచి వాంతులు, కడుపునొప్పి, మూత్రపిండాల వైఫల్యం వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు.
బాధితుల్లో ఎక్కువ మంది వృద్ధులు ఉండగా, ప్రస్తుతం మరో ఏడుగురు రాజమహేంద్రవరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు ధృవీకరించారు. ప్రాథమిక ఎపిడెమియోలాజికల్ ఆధారాల ప్రకారం పాలు కల్తీ కావడమే ఈ మరణాలకు ప్రధాన కారణమని ఆరోగ్య శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పలు ప్రభుత్వ విభాగాలు రంగంలోకి దిగి సమన్వయంతో విచారణను వేగవంతం చేశాయి. పరిస్థితిని సమీక్షిస్తున్న అధికారులు కల్తీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.