ఏపీలో మహిళల ర‌క్ష‌ణ‌కు 'అభయం'

Abhayam app for safety of AP Women ... ఆటోలు, క్యాబ్‌లలో ప్రయాణించే వారు తమ మొబైల్‌లో అభయం మొబైల్‌ అప్లికేషన్‌ను

By సుభాష్  Published on  23 Nov 2020 8:03 AM GMT
ఏపీలో మహిళల ర‌క్ష‌ణ‌కు అభయం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌జా ర‌వాణా వాహ‌నాల్లో మహిళ‌లు, చిన్నారుల ర‌క్ష‌ణ కోసం రూపొందించిన అభ‌యం యాప్‌ను సోమ‌వారం ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రారంభించారు. క్యాంప్‌ ఆఫీస్‌లో వర్చువల్‌ పద్ధతిలో అభయం యాప్ ని లాంచ్ చేశారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసం అభయం ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నామన్నారు. ఆటోలు, ట్యాక్సీలు, ఇతర ప్ర‌యాణ వాహ‌నాల్లో అభ‌యం యాప్ ప‌రికారాన్ని అమ‌ర్చ‌నున్న‌ట్లు తెలిపారు. తొలి విడుత‌గా విశాఖ‌లో వెయ్యి ఆటోల్లో ప్ర‌యోగాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న‌ట్లు వెల్డించారు. వ‌చ్చే ఏడాది పిబ్ర‌వ‌రి నాటికి 5వేల వాహానాల‌కు, జూలై 1 నాటికి 50వేల వాహ‌నాల‌కు న‌వంబ‌ర్ నాటికి లక్ష‌వాహ‌నాల‌కు అభ‌యం యాప్‌ను విస్త‌రిస్తామ‌న్నారు. ప్ర‌యాణంలో మ‌హిళ‌ల‌కు ఏదైనా అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి ఉంటే.. పానిక్ బ‌ట‌న్ నొక్కితే పోలీసుల‌కు స‌మాచారం అందుతుంద‌ని వివ‌రించారు.

యాప్ ఇలా పని చేస్తుంది :

ఆటోలు, క్యాబ్‌లలో ప్రయాణించే వారు తమ మొబైల్‌లో అభయం మొబైల్‌ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వాహనం ఎక్కే ముందు వాహనానికి అతికించిన క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి. దీంతో డ్రైవర్ ఫోటో, వాహనం వివరాలు మొబైల్‌కు వస్తాయి. స్మార్ట్‌ ఫోన్‌ వినియోగించే మహిళలు తమ ప్రయాణంలో ఇబ్బందులు ఎదురైతే మొబైల్‌ యాప్‌ నుంచి సంబంధిత వాహనం నంబరు పోలీసులకు పంపితే.. ఆ వాహనం ఎక్కడుందో జీపీఎస్‌ ద్వారా తెలుసుకుని పట్టుకునేందుకు వీలుంటుంది. స్మార్ట్‌ ఫోన్‌ లేని ప్రయాణికులు వాహనానికి బిగించిన ఐవోటీ పరికరంలోని ప్యానిక్‌ బటన్‌ నొక్కితే సమాచారం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్ కు చేరుతుంది. దీంతో క్యాబ్‌ లేదా ఆటో వెంటనే ఆగిపోతుంది. ఆ తర్వాత సమీపంలోని పోలీస్‌ అధికారులకు సమాచారం పంపి పట్టుకుంటారు.

అభయం మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.138.48 కోట్లు. ఇందులో కేంద్ర ప్రభుత్వం నిర్భయ స్కీం కింద 2015లో రాష్ట్రానికి 80.09 కోట్లు కేటాయించింది. దీంట్లో 58.64 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 55.39 కోట్లు కేటాయించాల్సి ఉంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును పర్యవేక్షించి టెండర్లను పరిశీలించింది. గతేడాది(2019) యష్‌ టెక్నాలజీస్‌ ఈ టెండర్ ను దక్కించుకుంది.

Next Story