ఏపీలో క్యాన్సర్ నిరోధానికి కీలక ముందడుగు..3 జిల్లాల్లో ఆధునిక రేడియేషన్ పరికరాలు
ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ నిరోధానికి కీలక ముందడుగు పడింది
By Knakam Karthik
ఏపీలో క్యాన్సర్ నిరోధానికి కీలక ముందడుగు..3 జిల్లాల్లో ఆధునిక రేడియేషన్ పరికరాలు
ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ నిరోధానికి కీలక ముందడుగు పడింది. రూ.48 కోట్ల విలువైన రేడియేషన్ యంత్రాల కొనుగోలుకు ONGC అంగీకారం తెలిపింది. ఈ క్రమంలో కాకినాడ, గుంటూరు, కడపలో ఆధునిక రేడియేషన్ పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. ONGC CSR నిధుల ద్వారా మూడు రేడియేషన్ మిషన్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి యంత్రం విలువ రూ.16 కోట్లు ఉంటుంది.
ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు బుధవారం ఢిల్లీలో కేంద్ర చమురు, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో, రాష్ట్రానికి క్యాన్సర్ వ్యాధిపై పోరాటంలో సహకారంగా ఓన్జీసీ నుండి CSR (Corporate Social Responsibility) నిధుల ద్వారా మూడు రేడియేషన్ మిషన్లను సమకూర్చే అంశంపై చర్చ జరగగా, ఒక్కొక్కటి సుమారు రూ.16 కోట్లు విలువగల పరికరాలు అందించేందుకు ONGC అంగీకరించింది. మొత్తం విలువ సుమారు రూ.48 కోట్లు. ఈ అత్యాధునిక యంత్రాలను త్వరలో కాకినాడ, గుంటూరు, కడప జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ పరికరాలు క్యాన్సర్ను ప్రారంభ దశలో గుర్తించడంలో, అలాగే రేడియేషన్ చికిత్సలో కీలకంగా పనిచేస్తాయి.
ఈ సందర్భంగా శ్రీ సానా సతీష్ బాబు మాట్లాడుతూ “ఇది కేవలం సాంకేతిక సహాయం కాదు… ప్రజల ప్రాణాల కోసం నిలిచే ఆశ. క్యాన్సర్పై పోరాటానికి కేంద్ర మంత్రుల సహకారం మాకు బలాన్ని ఇస్తోంది. ONGC యాజమాన్యానికి, కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, డా. పెమ్మసాని చంద్రశేఖర్ గార్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు.”..అని సానా సతీష్ పేర్కొన్నారు.