పార్వతీపురం-మన్యంలో ఏనుగుల సందడి

7 elephants entering Pujariguda village in Parvathipuram Manyam district. పార్వతీపురం మన్యం జిల్లాలోని పూజారిగూడ గ్రామంలోకి ప్రవేశించిన ఏడు ఏనుగులు ఇళ్ల ముందు తిరుగాడాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Jun 2023 1:28 PM GMT
పార్వతీపురం-మన్యంలో ఏనుగుల సందడి

పార్వతీపురం మన్యం జిల్లాలోని పూజారిగూడ గ్రామంలోకి ప్రవేశించిన ఏడు ఏనుగులు ఇళ్ల ముందు తిరుగాడాయి. అక్కడ నిల్వ ఉన్న నీటిని తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏనుగులు దాహం వేసి నీటిని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాయా అని చాలా మంది ఆశ్చర్యపోయారు. అయితే ఈ ఏనుగులు పరిసర ప్రాంతాల్లోని కొన్ని గ్రామాలకు నిత్యం సందర్శిస్తాయని చాలా మందికి తెలియదు. చిన్న బకెట్లలో నీటిని అందించి స్థానికులు సహాయం అందించారు. సమాచారం మేరకు కురుపాం రేంజ్ అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఏనుగులను సమీపంలోని అడవిలోకి తరిమికొట్టారు. ఈ గ్రామాలు ఒడిశా సరిహద్దుకు సమీపంలో ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో గత నాలుగు సంవత్సరాలుగా ఏనుగుల గుంపులు నిత్యం సందడి చేస్తూనే ఉంటాయి.


డిప్యూటీ కన్జర్వేటర్, విజయనగరం జిల్లా అటవీ అధికారి వెంకటేష్ సంబంగి మాట్లాడుతూ.. "ఈ ప్రాంతాల్లో ఏనుగులు గ్రామాల్లోకి రావడం మామూలే.. అయితే ఏనుగుల సంచారాన్ని ట్రాకర్లు 24/7 పర్యవేక్షిస్తున్నారని, ఏనుగులు గ్రామాల్లోకి రాగానే స్థానికులను అప్రమత్తం చేస్తుమని తెలిపారు. ఈ ఏనుగులు ఒకచోట నుండి మరొక ప్రదేశానికి వెళుతూ ఉన్న సమయంలో గ్రామాల్లోకి ప్రవేశించి నీరు త్రాగి ఉండవచ్చు." అని తెలిపారు. మొత్తం 11 ఏనుగులతో కూడిన ఈ ప్రత్యేక మంద ఈ అటవీ ప్రాంతాల్లో స్థిరపడింది. తగినంత ఆహారంతో పాటు నాగావళి నది, రిజర్వాయర్ కూడా ఉన్నాయి. అవి ఒక చోటు నుండి మరో చోటికి కదులుతూనే ఉంటాయి, ఒక్కోసారి గ్రామాల్లోకి ప్రవేశిస్తాయి. "ప్రతిరోజూ, 30 మంది సభ్యులతో కూడిన మూడు బృందాలు ఏనుగుల కదలికలను ట్రాక్ చేస్తూ 24/7 పనిచేస్తాయి. ఏనుగుల కదలికలు ఏవైనా ఉంటే, మనుషులు-జంతువులు ఒకరికొకరు ఎదురుపడడాన్ని నివారించడానికి మానిటరింగ్ రేంజ్ అధికారులు గ్రామాలు, స్థానిక దేవాలయాలు, రైల్వేలు, విద్యుత్ శాఖను అప్రమత్తం చేస్తారు." అని DFO అన్నారు.

పంటలలో మార్పులు:

అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, 2007 నుంచి ఒడిశా నుంచి ఆంధ్రాలోని రెండు సరిహద్దు జిల్లాలకు (శ్రీకాకుళం, విజయనగరం) ఏనుగులు రావడం ప్రారంభించాయి. ఇవి సాధారణంగా ఒడిశాలోని అడవుల నుండి విజయనగరం అటవీ విభాగానికి వెళ్లి శ్రీకాకుళం అటవీ డివిజన్ వైపు వలసపోతాయి. 2015కి ముందు వ్యవసాయ విధానం భిన్నంగా ఉండేది. శ్రీకాకుళం, విజయనగరంలో రిజర్వ్ ఫారెస్ట్‌ల సరిహద్దుకు దగ్గరగా ఉన్న వ్యవసాయ భూముల్లోని అనేక ప్రాంతాలలో చెరకు, అరటి, పైనాపిల్, మొక్కజొన్న పంటలు ఏనుగులను ఆకర్షించేవి. ఏనుగులు నివసించే రిజర్వ్ ఫారెస్ట్‌లకు దగ్గరగా అలాంటి పంటలను పండించకూడదని రైతు సంఘాలు సూచించాయి. ఆ పంటలకు బదులుగా వెల్లుల్లి, పసుపు, మల్బరీ, ఆముదం, మిరప, పత్తి, అల్లం, ఉల్లి, పొగాకు, తేయాకు వంటి పంటలను పెంచడం మొదలు పెట్టారు. పార్వతీపురం మన్యం జిల్లాల్లో కేవలం 2-3 గ్రామాలు మాత్రమే ఏనుగుల దాడిలో పంటలను నష్టపోతున్నాయి. మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లోని రైతులు ఏనుగుల బెడదను ఎదుర్కోవటానికి, పంట నష్టాన్ని తగ్గించడానికి కొన్ని శాస్త్రీయ చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.


ఏపీలో 100కు మించి ఏనుగులు లేవు:

ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 100 ఏనుగులు కూడా లేవని.. కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాల్లో 5000 కంటే ఎక్కువ ఏనుగులు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో ఆహారం కోసం ఒడిశా నుండి ఏనుగుల మందలు వలస వస్తూ ఉన్నాయి. 1980వ దశకం వరకు దాదాపు 200 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌లో అడవి ఏనుగుల ఉనికిని డాక్యుమెంట్ చేయలేదని నివేదికలు చెబుతున్నాయి.


పొరుగు రాష్ట్రాల్లో వాటి నివాసాలు, తినడానికి తిండి తగ్గిపోవడంతో ఏనుగులు ఆంధ్రాలో ప్రవేశించడం ప్రారంభించాయి. ప్రస్తుతం, పార్వతీపురం మన్యం-శ్రీకాకుళం జిల్లాల పరిసర ప్రాంతంలో 14 ఏనుగులతో మూడు గుంపులు ఉన్నాయి. పాలకొండలో 4, పార్వతీపురంలో 8, ఒడిశా నుండి 6 వలస వచ్చాయి (మేలో 4 మరణించాయి). అటవీ అధికారుల ప్రకారం, 28-30, జంతువుల కదలికలను పర్యవేక్షించడానికి ట్రాకర్లను నియమించారు. ప్రతి 2,000 హెక్టార్లకు, ఒక ఏనుగు ట్రాకర్ అందుబాటులో ఉంది.

ప్రమాదాలు:

2023 జూన్ 14న చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడు ఏనుగులు చనిపోయాయి. చిత్తూరు-పలమనేరు జాతీయ రహదారిపై జగమర్ల క్రాస్ వద్ద రోడ్డు దాటుతుండగా ట్రక్కు ఢీకొని మృతి చెందాయి. ఏనుగులను ఢీకొన్నప్పటి నుంచి ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. లారీ డ్రైవర్లు ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు.

ఫిబ్రవరిలో, ఆరు ఏనుగుల మంద ఒడిశా నుండి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చింది. ఇక్కడి అనుకూల పరిస్థితుల కారణంగా వచ్చేసి ఉంటాయని అంటున్నారు. అయితే మే నెలలో ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం బత్తిలిలో నాలుగు ఏనుగులు విద్యుదాఘాతానికి గురై మరణించాయి. పిల్ల ఏనుగు 11కెవి ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకడంతో పాటు బ్లాక్‌ను కొద్దిగా కదిలించడంతో ఈ ఘటన జరిగింది. ఓ ఏనుగు కిందపడగా, పిల్ల ఏనుగును రక్షించేందుకు ప్రయత్నించిన మిగతా మూడు ఏనుగులు కూడా చనిపోయాయి.


ఫిబ్రవరిలో పార్వతీపురం మన్యం జిల్లాలోని పసుకుడి గ్రామంలో అడవి ఏనుగు 26 ఏళ్ల ట్రాకర్‌ను తొక్కి చంపింది. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, జంతువు అతనిపై ఒక్కసారిగా దాడి చేయడంతో ఆ వ్యక్తి తప్పించుకోలేకపోయాడు. భామిని ప్రాంతాల్లో నాలుగు ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. విస్తారమైన భూమిలో ఉంచిన పత్తి పంటలను ధ్వంసం చేశాయి. స్థానికుల సమాచారం మేరకు లక్ష్మీనారాయణ అనే శిక్షణ పొందిన ఏనుగు ట్రాకర్ పసుకుడి గ్రామానికి చేరుకుని.. వంశధార నది ప్రాంతంలో వాటిని తరిమికొట్టడానికి ప్రయత్నించారు. అందులో ఒక ఏనుగు బెంబేలెత్తిపోయి అతడిని తొక్కి చంపేసింది.


Next Story