క‌రోనా క‌ల‌క‌లం.. ఒకే స్కూల్‌లోని 147 మందికి పాజిటివ్‌

147 Corona cases in the same school in Prakasam District.క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి త‌న పంజా విసురుతోంది. దేశంలోని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Jan 2022 5:27 AM GMT
క‌రోనా క‌ల‌క‌లం.. ఒకే స్కూల్‌లోని 147 మందికి పాజిటివ్‌

క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి త‌న పంజా విసురుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ రోజువారి పాజిటివ్ కేసులు భారీ సంఖ్య‌లో న‌మోదు అవుతున్నాయి. సంక్రాంతి సెల‌వుల అనంత‌రం రాష్ట్రంలో పాఠ‌శాల‌లు పునఃప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే.. పాఠ‌శాల్లో కూడా క‌రోనా కేసులు న‌మోదు అవుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ముఖ్యంగా ప్ర‌కాశం జిల్లాలోని స్కూళ్ల‌లో క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతోంది. తాజాగా 54 మంది ఉపాధ్యాయులు, 18 మంది విద్యార్థులు, న‌లుగురు నాన్ టీచింగ్ స్టాఫ్ కు క‌రోనా పాజిటివ్ తేలింది.

గ‌త ఐదు రోజుల్లో ప్ర‌కాశం జిల్లాలోని ఓ పాఠ‌శాల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 147 మందికి క‌రోనా బారిన ప‌డ్డారు. నిన్న ప్ర‌కాశం జిల్లా వ్యాప్తంగా 772 కరోనా కేసులు న‌మోదు కాగా.. అందులో 10 శాతం కేసులు పాఠ‌శాల‌ల్లో న‌మోదు అయిన‌వే కావ‌డం గ‌మ‌నార్హం. వీరంద‌రిని ఐసోలేష‌న్‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఇక పాఠ‌శాల‌ల్లో పాజిటివ్ కేసులు పెరుగుతుండ‌డంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల్లో ఆందోళ‌న నెల‌కొంది. క‌రోనా ఉద్దృతి త‌గ్గేవ‌ర‌కు పాఠ‌శాల‌కు సెల‌వులు ప్ర‌క‌టించాల‌ని ప‌లువురు కోరుతున్నారు.

ఇక నిన్న‌ రాష్ట్ర వ్యాప్తంగా 13,212 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు శుక్రవారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,53,268కి చేరింది. క‌రోనా వ‌ల్ల విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూరు, నెల్లూరులో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఐదుగురు మృత్యువాత ప‌డ్డారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,532గా ఉంది. 24 గంటల వ్యవధిలో 2,942 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,74,600కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 64,136 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,20,56,618 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

Next Story