శ్రీహరికోటలో కరోనా కలకలం

12 Members Tested Covid-19 Positive In SDSC.నెల్లూరు జిల్లా శ్రీహ‌రికోట‌లోని స‌తీష్ ధావ‌న్ అంత‌రిక్ష ప‌రిశోధ‌నా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Jan 2022 4:31 AM GMT
శ్రీహరికోటలో కరోనా కలకలం

నెల్లూరు జిల్లా శ్రీహ‌రికోట‌లోని స‌తీష్ ధావ‌న్ అంత‌రిక్ష ప‌రిశోధ‌నా కేంద్రం(షార్‌)లో క‌రోనా క‌ల‌క‌లం రేగింది. ఇద్ద‌రు వైద్యులు స‌హా 12 మంది ఉద్యోగులు క‌రోనా బారిన ప‌డ్డారు. వీరిలో ఎవ‌రైనా ఒమిక్రాన్ బారిన ప‌డ్డారో లేదో తెలుసుకునేందుకు వీరి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. ఒకే సారి ఇంత‌ మంది క‌రోనా బారిన ప‌డ‌డంతో షార్ యాజ‌మాన్యం ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డింది. దీంతో అక్క‌డ ప‌నిచేస్తున్న ఉద్యోగులంద‌రికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు.

డిసెంబర్ 27న ఇద్దరికి కరోనా పాజిటివ్ రాగా.. ఆదివారం ఒకరు కరోనా బారినపడినట్టు సమాచారం. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన షార్ ఉద్యోగులు హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. సోమ‌వారం 12 మందికి పాజిటివ్ తేల‌డంతో షార్ యాజ‌మాన్యం ప్ర‌త్యేక మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. బ‌యో మెట్రిక్ స్థానంలో అటెండెన్స్ రిజిస్ట‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. ఉద్యోగులు, వైద్యుల‌కు క‌రోనా సోక‌డంతో ఈనెల చివ‌రి వారంలో నిర్వ‌హించాల్సిన రీ శాట్ ఉపగ్ర‌హ ప్ర‌యోగం వాయిదా ప‌డే అవ‌కాశం ఉంది.

ఇక దేశంలో మ‌రోసారి క‌రోనా కేసులు పెరుగుతుండ‌డంతో ముందు జాగ్రత్తగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సెక్రటరీ స్థాయికి దిగువన సిబ్బందిలో 50 శాతం మందికి వర్క్ ఫ్రమ్ హోంకు అనుమతిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. జ‌న‌వ‌రి 31వ తేదీ వ‌ర‌కు ఈ ఆదేశాలు అమ‌ల్లో ఉంటాయ‌ని చెప్పింది. 50 శాతం మంది మాత్ర‌మే ఆఫీసుల‌కు రావాల‌ని.. మిగ‌తా వారు వ‌ర్క్ ప్ర‌మ్ హోమ్ విధానంలో ప‌నిచేయాల‌ని సూచించింది.

Next Story