ఆంధ్రా 'లాస్‌వెగాస్' భీమవరం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Jan 2020 1:24 PM GMT
ఆంధ్రా లాస్‌వెగాస్ భీమవరం

సంక్రాంతి అంటే అందరికీ గుర్తుకు వచ్చేది గోదావరి జిల్లాలే. అక్కడ కూడా ప్రధానంగా భీమవరం పేరే వినిపిస్తుంది. ముఖ్యంగా కోడి పందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక్కడి విలాస పురుషులకు జూదం, పందెం రెండు కళ్లలాంటివి. ఒక్క సంక్రాంతి పండుగ సమయంలో కోట్ల రూపాయలు చేతులు మారుతాయి. కోడి పందేలైతే భీమవరం తర్వాతే ఏదైనా... ఇక్కడి కోళ్ల పందాలను చూడానికి, ఆడడానికి రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. కాలన్నీ బట్టి పందాల తీరు మారుతూ ఇప్పుడు భారీ స్థాయికి చేరుకుంది. పందాలు నిర్వహించే ప్రదేశాల్లో జనాలను చూస్తే చాలు.. ఇది ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం అవుతుంది. కోళ్ల పందాలతో పాటు పావురాల పందాలు, ఎలక్షన్‌ల పందాలు, సినిమా పందాలు, క్రికెట్‌ బెట్టింగ్‌లు ఇలా రకరకాల, విచిత్రమై పందాలతో భీమవరం జుదానికి అడ్డగా మారింది.

అమెరికాలోని లాస్‌వెగాస్‌తో పోటీ పడే విధంగా మన భీమవరంలో అన్ని రకాల సౌకర్యాలు, పెట్టుబడులు, నెట్‌వర్కింగ్‌లు ఉన్నాయి. అందుకే ఆంధ్రప్రదేశ్‌ లాస్‌వెగాస్‌గా భీమవరాన్ని చెప్పుకుంటారు. రాష్ట్రంలోనే అత్యంత సంపన్నమైన పట్టణంగా కూడా భీమవరంకు పేరుంది. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లు చేసే వారు కూడా ఇక్కడ ఉన్నారంటే మీరే అర్థం చేసుకోవచ్చు.. భీమవరం పందాల రాయుళ్ల అడ్డా అని. ఎక్కడా మ్యాచ్‌ జరిగినా.. ఎప్పుడు జరిగినా ఇక్కడి నోట్లకు రేక్కలొస్తాయి. బెట్టింగ్‌లు అయితే కోట్ల రూపాయల్లోనే జరుగుతాయి.

ఇక్కడ మరో పందం కొత్తగా తెరపైకి వచ్చింది.. అదే పావురాల పందాలు. సంక్రాంతి సందర్భంగా ఓ క్లబ్‌ నిర్వహకులు ఈ పందాలను నిర్వహిస్తున్నారు. పావురాలను ఒకచోటు నుంచి వాహనంలో కొన్ని వందల కిలోమీటర్ల దూరం తరలించి వదిలేసినా మళ్లీ పాత చోటుకు సురక్షితంగా చేరుకుటాయి. ఇలా గాల్లోకి రివ్వున ఎగురుకుంటూ తిరిగి గూటికి ఫస్టోచ్చిన పావురంపై పందెం కాసిన వ్యక్తికి పైసలే, పైసలు.. ఎలక్షన్లు ఎక్కడా జరిగినా సరే.. బెట్టింగులు మాత్రం భీమవరంలో జరగాల్సిందే. ఇక పేకాట రాయుళ్లకు భీమవరంలో అడ్డు అదుపు కూడా లేదు. అంతెందుకు మహిళలకు కూడా ఇక్కడ పేకాట క్లబ్‌లు ఉన్నాయంటే మీరే అర్థం చేసుకోవచ్చు. కోడిపందాల మాటున కోట్ల రూపాయాల్లో పేకాట నడుస్తోంది. కోడిపందేలు ఒక ఎత్తయితే.. రాత్రి, పగలూ తేడా లేకుండా విద్యుత్‌ జనరేటర్లు అమర్చి మరీ లోనా.. బయటా పేకాట నిర్వహిస్తుంటారు. రెప్పపాటులో కోట్లు రూపాయలు జూదరుల చేతులు మారిన సంఘటనలు కోకొల్లలు. ఇవే కాకుండా.. గుండుపట్టాలతో జూదం కూడా ఇక్కడ నిర్వహిస్తారు.

రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన, అంత్యంత ఖరీదైన, శక్తిమంతమైన ఆలయం కూడా భీమవరంలోనే ఉంది. భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మను స్థానిక ప్రజలు ఆరాధిస్తారు. మావుళ్లమ్మకు 90 కిలోల బంగారం, 700 కిలోల వెండి నగలు ఉన్నాయి. ప్రతి ఏటా సంక్రాంతి సమయంలో 30 రోజుల పాటు మావుళ్ల ఉత్సవాలు జరుగుతాయి. ఇందుకోసం ఆలయ నిర్వహాకులు భారీ వ్యయంతో వేడుకలు నిర్వహిస్తారు.

రాష్ట్రంలోనే అత్యంత విలాసవంతమైన పట్టణంగా భీమవరానికి పేరుంది. ఇక్కడి లైఫ్‌స్టైల్‌, వ్యాపారం, అమ్మకాలు, కొనుగోళ్లు ఓ రేంజ్‌లో ఉంటాయి. ఇక్కడి నుంచే వివిధ దేశాలకు పెద్ద మొత్తంలో రోయ్యలు, చేపలు ఎగుమతి అవుతుంటాయి. ఇక్కడే ప్రాసెసింగ్‌ యూనిట్లు కూడా ఉన్నాయి. ప్రతి ఏటా మూడు రోయ్య పంటలతో వచ్చే ఆదాయం ఇక్కడి వారి జేబులను నింపుతోంది. ఇక్కడ రియల్‌ఎస్టేట్‌ ధరలు కూడా ఆకాశనంటుతున్నాయి. ప్రముఖ విద్యాసంస్థలు కూడా ఇక్కడ ఉన్నాయి.

పందాలు, విందులు వినోదాలకు భీమవరం కేరాఫ్‌ అడ్రస్‌. మరీంకెందుకు ఆలస్యం.. ఓ సారీ ఆంధ్రప్రదేశ్‌ లాస్‌ వేగాస్‌ భీమవరానికి వెళ్లి రండి..!

Next Story