అమరావతిలో 144 సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్ట్‌ అమలు

By Newsmeter.Network  Published on  26 Dec 2019 3:32 AM GMT
అమరావతిలో 144 సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్ట్‌ అమలు

అమరావతి: ధర్నా చౌక్‌లో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాజధానిని తరలించవద్దని అమరావతి జేఏసీ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మానవహారాలకు అమరావతి జేఏసీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతిలో పోలీసులు 144 సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్ట్‌ విధించారు. ఎలాంటి నిరసనలకు అనుమతి లేదన్న పోలీసులు.. అనుమతి లేకుండా నిరసనలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు తీవ్ర తరం అయ్యాయి. మందడంలో టెంట్‌ వేయడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయానికి వెళ్లే అధికారులకు అడ్డుపడొద్దని పోలీసులు తెలిపారు. కాగా మంత్రివర్గ సమావేశానికి సహకరిస్తామని రాజధాని రైతులు అన్నారు. రహదారిపై కాకుండా వేరే చోట టెంట్‌ వేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

రేపు ఏపీ కేబినెట్‌ భేటీ సందర్భంగా పోలీసులు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. సచివాలయ సమీప నివాసులకు పోలీసుల నోటీసులు ఇచ్చారు. కొత్త వ్యక్తులను ఇళ్లలో ఉంచొద్దని, ఒక వేళ వస్తే తమకు తేలియాజేయాలి పోలీసులు తెలిపారు. కేబినెట్‌ భేటీ రోజు నిరసనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కాగా నోటీసుల జారీపై మందడం గ్రామస్తుల అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నేడు రాజధాని గ్రామాల్లో టీడీపీ నేత నారా లోకేష్‌ పర్యటించనున్నారు. ఎర్రబాలెం, మందడం, వెలగపూడిలో రైతుల దీక్షల్లో నారా లోకేష్‌ పాల్గొననున్నారు. రాజధాని రైతులకు నారా లోకేష్‌ సంఘీభావం తెలపనున్నారు.

ఇవాళ రాజధాని ప్రాంత వైసీపీ నేతలు భేటీ కానున్నారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మధ్యాహ్నం 3.30 గంటల సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా మూడు రాజధానుల ఏర్పాటు, రైతుల ఆందోళనపై చర్చించనున్నారు. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం అభివృద్ధి, ప్రణాళికలపై వైసీపీ నేతలు నిర్ణయం తీసుకోనున్నారు. రైతులకు భరోసా ఇచ్చేందుకే ఈ సమావేశమని వైసీపీ నేతలు అంటున్నారు. కాగా భేటీ తర్వాత ప్రభుత్వ ప్రణాళికలను వైసీపీ నేతలు వివరించనున్నారు.

Next Story