పబ్జీ ని మరిచిపోండి.. ఫౌజీ వచ్చేస్తోంది
By తోట వంశీ కుమార్ Published on 4 Sept 2020 6:18 PM IST
పబ్జీ మొబైల్ సహా 118 చైనా యాప్స్ను నిషేధిస్తూ ఇటీవలే కేంద్రం నిర్ణయం తీసుకుంది. దేశ భద్రత, సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లుతుందనే కారణంతో ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. దేశంలో పబ్జీ గేమ్పై నిషేదం విధించిన నేపథ్యంలో.. ఆ తరహా కొత్త గేమ్ను భారత్లో ప్రేవేశపెడుతున్నారు. ఎన్ కొర్ గేమ్స్ రూపొందించిన ఈ ఫౌజీ గేమ్ పబ్జీకు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. ఈమేరకు అక్షయ్ కుమార్ కీలక ప్రకటన చేశారు.
ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుమేరకు ఆత్మ నిర్భర్ భారత్ ఉద్యమంలో భాగంగా ఫౌజీ(ఫియర్లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్) తీసుకొస్తున్నట్లు అక్షయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కేవలం వినోదం కోసమే కాకుండా ఈ గేమ్ ద్వారా మన సైనికుల త్యాగాలను తెలియజేయబోతున్నాం అని అక్షయ్ చెప్పారు. ఈ గేమ్ ద్వారా వచ్చిన ఆదాయంలో 20 శాతం భారత్కా వీర్ ట్రస్ట్ కు అందజేస్తామన్నారు. గేమ్కు సంబంధించిన పోస్టర్ను అభిమానులతో పంచుకున్నారు. దీనిని బెంగళూరుకు చెందిన ఎన్కోర్ గేమ్స్ రూపొందించింది. అక్షయ్ కుమార్ దీనికి మెంటార్గా వ్యవహరిస్తున్నారు. గేమ్ను త్వరగా తీసుకురావాలని.. ఈ గేమ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని పలువురు నెటీజన్లు ట్వీట్ చేస్తున్నారు.