కరోనా పరీక్షలు చేయించుకుంటేనే కాపురం..
By తోట వంశీ కుమార్ Published on 29 March 2020 12:24 PM IST
కరోనా వైరస్(కొవిడ్-19) ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ మహమ్మారి కట్టడికి ఇప్పటికే చాలా దేశాలు లాక్డౌన్ను ప్రకటించాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. కరోనా పై ప్రజలు చైతన్యవంతులవుతున్నారు అనేందుకు ఈ ఘటనే నిదర్శనం.
కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని ఓ వివాహిత తన భర్త కరోనా పరీక్షలు చేయించుకున్నాకే కాపురం చేస్తానని తేల్చి చెప్పింది. వివరాల్లోకి వెళితే.. ఆదోని మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడలో డ్రైవర్గా పనిచేస్తుండేవాడు. కాగా రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. కరోనా వ్యాపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. వైద్య పరీక్షలు చేయించుకోమని భర్తకు చెప్పింది. ఆమె మాటలను భర్త ప ట్టించుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. పరీక్షలు చేయించుకుకోకపోతే ఎలా.. తనకూ, పిల్లలకు కరోనా సోకుతుందేమోనని ఆమె భయపడి శనివారం రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే వారిద్దరిని ఆదోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన అనంతరం అతన్ని ఆదోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.