దుండగుడి కాల్పులు.. మాజీ ఎంపీ సహా 8 మంది మృతి
By సుభాష్
ఆప్ఘనిస్థాన్లో దారుణం చోటు చేసుకుంది. ఈస్టర్న్ కోస్ట్ ప్రావిన్స్ లోని ఓ క్లినిక్లో ఆయుధాలతో వచ్చిన దుండగుడు విచాక్షణ రహితంగా కాల్పులకు దిగాడు. ఈ కాల్పుల్లో 8మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడింది ఎవరన్నది ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. మృతుల్లో హిజ్బ్ -ఈ- ఇస్లామీ నాయకుడు, మాజీ ఎంపీ అబ్దుల్ వలీ ఇక్లాస్ కూడా ఉన్నట్లు తెలిపారు.
అయితే ఈ-ఇస్లామీ సంస్థ గతంలో కూడా యూఎస్, ఆప్ఘనిస్థాన్కు వ్యతిరేకంగా పని చేసిందని, 2016లో జరిగిన శాంతి ఒప్పందం తర్వాత ప్రభుత్వానికి లొంగిపోయి ఓ రాజకీయ పార్టీగా అవతరించిందని తెలుస్తోంది.
అలాగే ఆప్ఘన్ రాజధాని అయిన కాబుల్ ప్రాంతంలో కూడా శుక్రవారం ఓ మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా పేలుడు సంభవించింది. ఈ ఐఈడీ బాంబు పేలుడులో నలుగురు మృతి చెందారు. వీరిలో మసీదు షేర్ షా సూరీ మసీదు ఇమామ్ కూడా మరణించాడు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడుకు పాల్పడినట్లు ఓ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటించలేదు.