బాలికల హాస్టల్లోకి.. వెంటిలేటర్ ద్వారా చొరబడి..
By అంజి Published on 25 Feb 2020 3:53 PM IST
ముఖ్యాంశాలు
- బాలికల హాస్టల్లోకి చొరబడ్డ యువకుడు
- రాత్రంతా స్నేహితురాలి గదిలోనే ఉన్న యువకుడు
- నిందితుడికి సహకరించిన ముగ్గురు బాలికలకు టీసీలు ఇచ్చిన ప్రిన్సిపాల్
ఆదిలాబాద్ జిల్లాలో బాలికల హాస్ట్లోకి ఓ యువకుడు చొరబడిన ఘటన కలకలం రేపుతోంది. నార్నూర్లోని మోడల్ స్కూల్లోని హాస్టలోకి ఓ యువకుడు చొరబడ్డాడు. రాత్రంతా స్నేహితురాలి గదిలోనే యువకుడు ఉన్నాడు. హాస్టల్లో వార్డెన్లు, సెక్యూరిటీ సిబ్బంది ఉన్న కళ్లుగప్పి యువకుడు హాస్టల్లోకి ప్రవేశించాడు. వెంటిలేటర్ ద్వారా నిందితుడు యువకుడు హాస్టల్లోకి చొరబడినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలసుకున్న స్కూల్ ప్రిన్సిపాల్.. ముగ్గురు బాలికలను మందలించింది. యువకుడికి సహకరించిన ముగ్గురు బాలికలకు స్కూల్ ప్రిన్సిపాల్ టీసీలు ఇచ్చి పంపివేసినట్లు సమాచారం. ఈ నెల 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కాగా ఇటీవల నూజీవీడు ట్రిపుల్ ఐటీ ఘటన, మచిలీపట్నంలోని బచ్చుపేటలో చోటు చేసుకున్న ఘటనలు తీవ్ర కలకల సృష్టిస్తున్నాయి. నూజీవీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థినుల హాస్టల్లో ప్రవేశించి ఓ యువకుడు రోజంతా అక్కడే ఉన్న సంగతి తెలసిందే. అమ్మాయిల హాస్టల్లోని మంచం కింద పడుకున్న ఓ యువకుడు సెక్యూరిటీకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. బచ్చుపేటలోని బాలికల వసతి గృహంలోని వంట రూమ్లో బిర్యానీ వండి.. అమ్మాయిలతో కలిసి యువకులు విందు చేసుకున్నారు. మిత్రుడి పుట్టిన రోజు వేడుకల పేరుతో 10 మంది యువకులు బాలికల వసతిగృహంలోకి వచ్చారు. యువకులు వచ్చిన సమయంలో వసతి గృహంలో వార్డెన్స్ ఎవరూ లేరు. బాలికల వసతి గృహంలో యువకులు ఏకంగా 4 గంటల పాటు ఉన్నట్లు తెలిసింది. ఈ వరుస ఘటనలతో విద్యార్థినుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ, స్కూల్ హాస్టళ్ల యాజమానులు బాలికల భద్రతపై దృష్టి సారించాలని కోరుతున్నారు.