సీనియర్‌ నటికి తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్‌పై చికిత్స

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 July 2020 1:20 PM GMT
సీనియర్‌ నటికి తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్‌పై చికిత్స

తెలుగు, తమిళం, కన్నడ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి జయంతి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొన్నాళ్లుగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో మంగళవారం ఆమెను బెంగళూరులోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు వెంటిలేటర్‌ అమర్చారు. 35 సంవత్సరాలుగా ఆమె ఆస్తమాతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా.. ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌గా వచ్చింది.

జయంతి తనయుడు కృష్ణకుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తన తల్లి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆమె కోలుకుంటున్నారని వెల్లడించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో చూసేందుకు ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు. 1963లో కన్నడ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు జయంతి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, సినిమాల్లో నటించారు. ఇప్పటి వరకు 500పైగా చిత్రాల్లో నటించారు. తెలుగులో భార్యభర్తలు సినిమాతో కెరీర్‌ ప్రారంభించారు. హీరోయిన్‌గా నటించడంతో పాటు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పెదరాయుడు, సైరా నర్సింహరెడ్డి వంటి చిత్రాల్లో నటించారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఎన్నో అవార్డులు.. రివార్డులు సొంతం చేసుకున్నారు. క‌ర్ణాట‌క ఫిల్మ్ అవార్డులు, ఉత్త‌మ న‌టి, ఉత్త‌మ స‌హాయ‌న‌టి, ప్రెసిడెంట్ మెడ‌ల్, రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డుల‌ను అందుకున్నారు. జ‌యంతి 1945లో బ‌ళ్లారిలో జ‌న్మించారు.

Next Story