నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు... స్పెషల్ టీమ్ ఆదేశాలు ఇవే
By Newsmeter.Network Published on 6 Dec 2019 1:02 PM GMTదిశ హత్య కేసులో ఎన్కౌంటర్ అయిన నిందితుల అంత్యక్రియలు నిర్వహించేందుకు వారి బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహబూబ్నగర్ ప్రభుత్వాస్పత్రిలో నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను ఆయా తహసీల్దార్ల ఆద్వర్యంలో వారి తల్లిదండ్రులకు అప్పగిస్తారు. మహమ్మద్ ఆరీఫ్ మృతదేహాన్ని తీసుకుపోయేందుకు బంధువులు ఆసుపత్రికి వచ్చారు. జక్లేర్ గ్రామంలో ఆరీఫ్ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మిగతా ముగ్గురు నిందితులు జొల్లు శివ, జొల్లు నరేశ్, చింతకుంట చెన్నకేశవులు మృతదేహాలకు గుడిగండ్ల గ్రామంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఘటనా స్థలంలో నిందితుల మృతదేహాలకు పంచనామా నిర్వహించి మహబూబ్నగర్ ఆసుపత్రికి తరలించారు. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. మరోవైపు దిశ ఇంటి దగ్గర భద్రత పెంచారు. దిశ నిందితుల ఎన్కౌంటర్ నేపథ్యంలో భద్రత పెంచినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇంట్లోకి ఎవరినీ అనుమతించవద్దని స్పెషల్ టీమ్ ఆదేశాలు జారీ చేసింది. కాలనీలోని ఇతరులను దిశ ఇంటికి రానివ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు.