తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు
By సుభాష్ Published on 6 April 2020 5:46 PM IST
తెలంగాణలో ఈ రోజు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 339కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా కారణంగా 11 మంది మరణించారు. కరోనా మహమ్మారి రోజురోజుకు పెరిగిపోతోంది. ఒక రోజులో రాష్ట్రంలో 62 కొత్తగా కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతుండటంతో మరింత భయాందోళన నెలకొంది.
ముందుగా కేసుల సంఖ్య మామూలుగానే ఉన్నా.. ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనల నేపథ్యంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఒక్క హైదరాబాద్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో వ్యాపించేసింది కరోనా. దీంతో కేసీఆర్ సర్కార్ మరింత అప్రమత్తమైంది. ఢిల్లీ వెళ్లిన వారి వివరాలను తెలుసుకుని వారిని క్వారంటైన్కు తరలిస్తున్నారు. ఇప్పటి వరకూ పాజిటివ్ కేసుల్లో గానీ, మృతుల సంఖ్యలో గానీ ఢిల్లీ వెళ్లి వచ్చిన వారివే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్డౌన్ కారణంగా ఎంతో నష్టం జరిగిపోతోంది. సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇక లాక్డౌన్ ఎత్తివేసే సమయం దగ్గర పడుతుండటం, కేసుల సంఖ్య మరింత పెరగడం .. అసలు లాక్డౌన్ ఎత్తివేస్తారో లేదోనన్న టెన్షన్ మరింత నెలకొంది.