జహీరాబాద్ అత్యాచారం కేసులో కీలక మలుపు.. నిందితుల్లో ఒకరు మృతి, ఇద్దరు అరెస్ట్
By సుభాష్ Published on 12 Feb 2020 3:50 PM IST
తెలంగాణలోని జహీరాబాద్లో జరిగిన అత్యాచారం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బస్సులో వెళ్తున్న ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు పోలీసులమని చెప్పి, లగేజీని తనిఖీ చేయాలంటే బస్సును దింపేసి పాడుబడ్డ బావిలోకి తీసుకెళ్లి ముగ్గురు అత్యాచారం జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అత్యాచారం జరిగిన ప్రాంతంలో పోలీసులు సీసీ పుటేజీలను పరిశీలించారు. వాటి ఆధారంగా నిందితులు కర్ణాటకలోని బీదర్లో ఉన్నట్లు గుర్తించారు.
దీంతో అక్కడికెళ్లిన తెలంగాణ పోలీస్ బృందం రాయ్కోడ్ మండలం మహబత్పూర్ వద్ద ముగ్గురిని అదుపులోకి తీసుకునేందకు ప్రయత్నించగా, వారు తప్పించుకుని కారులో వెళ్లిపోయారు. కారులో అతివేగంగా వెళ్లడంతో సిరూర్ సమీపంలో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక నిందితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, నిందితులు వరంగల్, కాజీపేట ప్రాంతాలకు చెందిన ప్రవీణ్, వీరభద్రచారి, చిన్న చారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఐదుగురు బృందంగా ఏర్పడి మహిళలనే టార్గెట్ చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.