మహానేతకు ఘన నివాళి
By సుభాష్ Published on 2 Sep 2020 7:06 AM GMTదివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్థంతి సందర్భంగా బుధవారం ఇడుపులపాయలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. జగన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ షర్మిల, జగన్ మామ డా.గంగిరెడ్డి, ఇతర నేతలు రాజశేఖరరెడ్డి సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. ఘాట్ వద్ద ప్రార్థనలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ మేరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతోపాటు ప్రతి ఒక్కరికి హ్యాండ్ శానిటేషన్, థర్మల్ స్క్రీనింగ్ చేశారు. అలాగే భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. సీఎం జగన్ ఇడుపులపాయ పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నేతలు, నాయకులు వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి సేవలను, అమలు చేసిన పథకాలను గుర్తు చేసుకున్నారు.