'వైఎస్సార్ లా నేస్తం' పథకం.. దరఖాస్తుల స్వీకరణ
By న్యూస్మీటర్ తెలుగు
అమరావతి: జూనియర్ అడ్వొకేట్లకు నెలకు రూ.5 వేల చొప్పున భృతి కోసం ఉద్దేశించి వైఎస్సార్ లా నేస్తం పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం ప్రకటించింది. అడ్వొకేట్ల ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో నమోదై కనీసం మూడేళ్లు నిండాలని.. అంత కంటే తక్కువ సమయం నుంచి న్యాయవాద వృత్తిని ప్రాక్టీసు చేస్తూ ఉండాలని ప్రభుత్వం షరతు విధించింది. జనవరి 1 నుంచి పంపిణీ ప్రారంభించి మొదటి మూడేళ్లు మాత్రమే చెల్లిస్తామని సృష్టం చేసింది. జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5 వేల చొప్పున జనవరి 1 నుంచి ప్రభుత్వం అందజేయనుంది. ఏపీ బార్ కౌన్సిల్లో 61 వేల మంది న్యాయవాదులున్నారు. కొత్తగా బార్ కౌన్సిల్లో ఏటా 1500 మంది పేర్లు నమోదు అవుతున్నాయి. మూడేళ్లే లేదా అంతకు తక్కువ లోపు న్యాయవాద వృత్తి ప్రాక్టీసు తప్పనిసరి. ఎన్రౌల్మెంట్ ధ్రువపత్రం ఆధారంగా మొదటి మూడేళ్లు నెలకు రూ.5 వేల చొప్పన ప్రభుత్వం అందిస్తుంది. దరఖాస్తుదారులు కనీసం న్యాయశాస్త్రంలో పట్టా పొంది ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. 2016 తర్వాత న్యాయశాస్త్ర పట్టా పొందిన వారే అర్హులు, న్యాయవాద వృత్తిని ప్రాక్టీసు చేయని వారిని అనర్హులుగా ప్రకటించింది. కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలున్నా పథకం వర్తించదని, 35 ఏళ్లు దాటితే పథకం వర్తించదని వైఎస్సార్ లా నేస్తం పథకం మార్గదర్శకాల్లో ప్రభుత్వం తెలిపింది.
ysr law nestam.ap.gov.inలో దరఖాస్తుల స్వీకరణ