వివేకా హత్య కేసులో ట్విస్ట్.. అనుమానితుల పేర్లు ఇవే..

By Newsmeter.Network  Published on  28 Jan 2020 4:49 PM GMT
వివేకా హత్య కేసులో ట్విస్ట్.. అనుమానితుల పేర్లు ఇవే..

అమరావతి : వైఎస్‌ వివేకా హత్య కేసును సిబిఐ కి అప్పగించాలంటూ అతని కుమారై సునీతా రెడ్డి హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. వివేకా హత్యకేసులో కొందరిపై అనుమానాలున్నాయంటూ హైకోర్టులో రిట్‌ వేశారు. ఈ మేరకు కొందరి పేర్లతో కూడిన జాబితాను హైకోర్టుకు ఆమె సమర్పించారు.

సునీత పేర్కొన్న జాబితాలోని పేర్లు :

వాచ్‌మన్‌ రంగయ్య

ఎర్ర గంగిరెడ్డి

వైఎస్‌ అవినాష్‌రెడ్డి సన్నిహితుడు ఉదయ్‌కుమార్‌రెడ్డి

వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శివశంకర్‌రెడ్డి

పరమేశ్వర్‌రెడ్డి

శ్రీనివాసరెడ్డి

వైఎస్‌ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి

వైఎస్‌ మనోహర్‌రెడ్డి

వైఎస్‌ అవినాష్‌రెడ్డి

సీఐ శంకరయ్య

ఏఎస్‌ఐ రామకృష్ణారెడ్డి

ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి

మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి

మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి

ఘటనాస్థలంలో ఉన్నవారి, సన్నిహితుల సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత తమకు కొందరిపై అనుమానాలున్నాయని పై జాబితాను సునీత కోర్టుకు సమర్పించారు. హత్యకేసును సీబీఐకి అప్పగించాలని ఇప్పటికే వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి హైకోర్టులో పిటిషన్లు వేశారు.

కాగా విచారణ తుది దశలో ఉందని ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదని కోర్టుకి ప్రభుత్వం తెలిపింది. అన్ని పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి ఇంకా దర్యాప్తు సాగుతూనే ఉంది. తదుపరి విచారణ ఫిబ్రవరి 6కు హైకోర్టు వాయిదా వేసింది. మరీ హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగిస్తుందో లేదో ఫిబ్రవరి 6న తెలియనుంది.

వివేకా హత్య సమయంలో సునీత సీబీఐ విచారణకు డిమాండ్‌ చేశారు. కానీ ఆ తర్వాత వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రావడంతో ఆ డిమాండ్‌ను పక్కన పెట్టారు. సోదరుడు సీఎం జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయినా ఇప్పటి వరకు వివేకా హత్య కేసు పట్టించుకోకపోవడంతో సునీత హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

2019 మార్చి 14న వైఎస్‌ వివేకా అతని సొంత ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. వైఎస్‌ వివేకాను గొడ్డళ్లతో నరికి చంపారు. ఈ హత్య ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాల్లో పెను ప్రకంపనలు లేపింది. చంద్రబాబు సీఎం ఉన్న సమయంలో ఈ హత్యజరగడంతో అధికార, విపక్షాలు హోరాహోరిగా వైఎస్‌ వివేకాను చంపింది మీరంటే, మీరంటూ తెగ ఆరోపణలు చేసుకున్నారు. చివరికి ఈ కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం స్పెషల్‌ ఇన్వెస్టిగేటివ్‌ టీమ్‌ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కొత్తగా ఏర్పడిన జగన్‌ ప్రభుత్వం కూడా మరో సిట్‌ను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి చాలా మంది నేతలను సిట్‌ ప్రశ్నించింది.

Next Story