వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడి జరిగి ఏడాది..!!
By న్యూస్మీటర్ తెలుగు Published on 25 Oct 2019 9:09 AM GMTఒంట్లో కత్తి దిగినా చిరు నవ్వు చెరిగిపోలేదు..
కళ్ల ముందే నెత్తురు చిమ్మినా బెదిరిపోలేదు..
నరాల్లో నొప్పి పుట్టినా పట్టుదల వీడలేదు..
గుండెల్లో ధైర్యం సడలల్లేదు..
ఆ బ్లడ్ కి వెనకడుగు వెయ్యడం తెలియదు...
ఆ బిడ్డ కి భయపడటం తెలియదు...
తన కోసం వచ్చిన వాళ్ళ కోసం నవ్వుతూ..భరోసా ఇస్తూ..
దాడి తరువాత కూడా వైఎస్ జగన్ ముందుకు కదిలారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న రోజులవి. తమ కోసం వస్తున్న వైఎస్ జగన్ కోసం ప్రజలు పోటెత్తుతున్నారు.రోజుకు వేల మంది ఆయన అడుగులో అడుగేస్తున్నారు. ఆయనొస్తే తమ బాధలు పోతాయనే నమ్మకం అనుకుంటా..లక్షల మంది వైఎస్ జగన్కు తోడుగా కదులుతున్నారు.
పాదయాత్ర విజయనగరం జిల్లాలో కొనసాగుతుంది. హైదరాబాద్ రావడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఆయన కోసం వేలాది అభిమానులు విశాఖ ఎయిర్ పోర్ట్ బయట, లోపల ఉన్నారు. ఎయిర్ పోర్ట్లో విశ్రాంతి గదిలో కూర్చుని..విమానం కోసం ఎదురు చూస్తున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆయనతోపాటు మరికొంత మంది వైఎస్ఆర్ సీపీ నేతలు కూడా ఉన్నారు. ఇంతలో ఒక ఆడ మనిషి కాఫీ తీసుకుని వచ్చింది. ఆమెతోపాటు ఓ కుర్రాడు వాటర్ బాటిల్తో వచ్చాడు. సెల్పీ కోసం వైఎస్ జగన్ను రిక్వైస్ట్ చేశాడు . సెల్పీ ఇవ్వడానికి ప్రయత్నిస్తుండగానే తన జేబులో ఉన్న కత్తితో ఆ యువకుడు జగన్ మీద దాడి చేశాడు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమయస్ఫూర్తితో పక్కకు తప్పుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పక్కకు జరగడంతో గురి తప్పి ఆ కత్తి భుజానికి దిగింది. దాడి సమయంలో వైఎస్ జగన్ తెల్ల షర్ట్లో ఉన్నారు. ఆ యువకుడు కత్తితో దాడి చేయడంతో రక్తం ఒక్కసారిగా చిమ్మింది. షర్ట్ మొత్తం రక్తంతో తడిచిపోయింది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అదే షర్ట్తో బయటకు వస్తే..ఆయన అభిమానులు ఎలా స్పందించేవారో ఊహిస్తేనే భయమేస్తోంది. కాని..వైఎస్ జగన్ కు ఓ లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ముందు ఈ దాడి చాలా చిన్నది. దాడి ఎందుకు చేశారో వైఎస్ జగన్ కు తెలియదని అనుకోలేం. అందుకే..ఆయన షర్ట్ మార్చుకుని , ప్రాధమిక చికిత్స చేయించుకుని విశ్రాంతి గది నుంచి బయటకు వచ్చారు. కాని..ఆ దాడి జరిగిన తరువాత కూడా ఆయనలో వీసమెత్తు బెరుకు కూడా కనిపించలేదు. పట్టుదల సడల్లేదు. అదే చిరునవ్వుతో అభిమానులకు కనిపించారు. అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు కదిలారు.
అయితే..దాడికి ఎవరు ప్లాన్ వేశారు..? ఎప్పుడు ప్లాన్ వేశారు? ఇవన్నీ ఒక ఎత్తైతే. దాడి చేయడానికి ఎన్నుకున్న ప్రాంతం చర్చనీయాంశమైంది. దాడి జరిగింది ఎయిర్పోర్ట్లో..అక్కడ కేంద్ర భద్రతా సిబ్బంది ఉంటుంది. కాబట్టి...వైఎస్ జగన్కు ఏం జరిగినా.. అది కేంద్రం లిస్ట్లోకి పోతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధంలేదని చేతులు దులుపుకోవచ్చు. ఇది ప్లాన్ వేసిన వారి స్కెచ్. దాడి చేసిన ఆయుధం ఎయిర్ పోర్ట్లోకి రావడం అంటే మాటలు కాదు..ఎలా వచ్చింది? ఎవరి సాయంతో వచ్చింది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. దాడి చేయడానికి 'మనిషినే ఆయుధంగా' తయారు చేశారు అంటే..కుట్ర రాజకీయాలు ఎలా రాజ్యమేలాయో చెప్పొచ్చు.
ఈ దాడి మీద కూడా టీడీపీ , వైఎస్ఆర్ సీపీ మాటల అస్త్రాలు వదులుకున్నారు. టీడీపీయే దాడి చేయించిందని వైఎస్ఆర్ సీపీ నేతలు నిప్పులు చెరిగారు. అయితే..రాబోయే ఎన్నికల్లో సానుభూతి కోసమే వైఎస్ఆర్ సీపీ దాడి చేయించుకుందని టీడీపీ ఎదురు దాడి చేసింది. దాడి చేసిన యువకుడి జేబులో దొరికిన లేఖపై అనేక అనుమానాలు . ఆ లేఖ ముగ్గురి చేతి రాతలా ఉంది. ప్రాధమిక విద్య అభ్యసించిన యువకుడు అంత తెలివిగా లేఖ రాయగలడా?.పైగా జైల్లో పుస్తకం కూడా రాశాడట..! ఇది నిజమేనా. ఇలా అనేక ప్రశ్నలు , సందేహాలు..సమాధానాలు లేనివి ఉన్నాయి.
దాడికి స్కెచ్ వేసిన వారు, దాడి చేసిన వాడు, దాడికి పురికొల్పిన వారు ఎంత పకడ్బందీగా కుట్ర పన్నినా..ఏం చేయలేకపోయారు. కాని..ఈ దాడి ఎవరో చేయించారో ప్రజలు ఊహించారు అనుకుంటా..అందుకే..ప్రజల నేతను కాపాడుకోవడానికి ఎన్నికల కోసం ఎదురు చూశారు. ఎన్నికలు వచ్చాయి. ఈవీఎంల్లో ఫ్యాన్ సింబల్ అరిగిపోయేలా నొక్కేశారు. 151 అసెంబ్లీ సీట్లు, 22 లోక్సభ సీట్లు వైఎస్ జగన్కు ఇచ్చి ..అభిమానం చాటుకున్నారు.
ఎప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక మాట అంటుంటారు. "దేవుడు ఉన్నాడని..పై నుంచి అన్ని చూస్తుంటాడు"అని. దాడి నుంచి ఆ దేవుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాపాడాడు అని ఆయన అభిమానులు చెబుతుంటారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం కావాలని ఆయన నుదుట మీద రాసి ఉన్నప్పుడు ప్రత్యర్ధుల కుట్రలు ఎలా పని చేస్తాయన్నారు ఆయన అభిమానులు. ఆ కుట్రలను ఛేదించి ప్రజా ఆశీర్వాదంతో మే30న సీఎంగా సగర్వంగా వైఎస్ జగన్ ప్రమాణం చేశారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఉన్న ధైర్యమే ఆయనను నిలబెట్టిందంటారు చాలా మంది రాజకీయ విశ్లేషకులు. వైఎస్ జగన్లోని సహనమే ఆయనకు ప్రజలు జేజేలు పలికేలా చేసిందని చెబుతారు. వైఎస్ జగన్లోని పట్టుదల ప్రత్యర్ధులను తుత్తునీయులు చేసిందని..అందుకే మాస్ లీడర్ అయ్యారని టీపీపీనేతలే చెప్పుకుంటూ ఉంటారు.
వై.వి.రెడ్డి, న్యూస్ ఎడిటర్, న్యూస్ మీటర్