నిధులు జాగ్రత్తగా ఖర్చు పెట్టండి: సీఎం వైఎస్ జగన్
By న్యూస్మీటర్ తెలుగు Published on 28 Oct 2019 4:18 PM ISTఅమరావతి: జలవనరులశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. కృష్ణా, గోదావరి, పెన్నా బేసిన్లలో ఉన్న రిజర్వాయర్ల నీటి మట్టాలు, ప్రస్తుత పరిస్థితిపై సీఎంకు అధికారులు వివరించారు.ప్రాంతాలు, ప్రాజెక్టులు, జిల్లాల వారీగా జరుగుతున్న పనులపై సీఎంకు నివేదిక అందించారు. ఇప్పటికే పనులు జరుగుతున్న పోలవరం, వెలిగొండ, వంశధార సహా, కొత్త ప్రతిపాదిత ప్రాజెక్టులపైనా అధికారులతో సుదీర్ఘంగా సీఎం చర్చించారు. ఇంత వరద వచ్చినా కొన్ని ప్రాజెక్టులు పూర్తిగా నింపక పోవడంపై సీఎం ఆరా తీశారు. కాల్వల సామర్థ్యం, పెండింగులో ఉన్న పనులపై అధికారుల నుంచి సీఎం జగన్ సమాచారం కోరారు. 40 రోజుల్లో అన్ని ప్రాజెక్టులు నిండేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం సూచించారు. ప్రతిపాదనలతో నివేదిక అందించాలన్నారు.
కొత్తగా చేపట్టాల్సిన ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో విభజించి ఆమేరకు అంచనాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నిధుల వినియోగంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం అధికారులను హెచ్చరించారు. ప్రాధాన్యతల పరంగా ఖర్చు చేయాలన్నారు. చేసిన ఖర్చుకు ఫలితాలు వచ్చేలా ఉండాలన్నారు. భూసేకరణ, అటవీ అనుమతుల సమస్యల కారణంగా చాలా వరకు జలయజ్ఞంప్రాజెక్టులు పెండింగ్లో ఉంటున్నాయని అధికారులు చెప్పారు. జలయజ్ఞం ప్రాజెక్టులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు చెప్పారు సీఎం జగన్.