జగన్‌ పాలనకు ఏడాది.. తీసుకున్న సంచలన నిర్ణయాలు ఇవే..

By సుభాష్  Published on  30 May 2020 6:03 AM GMT
జగన్‌ పాలనకు ఏడాది.. తీసుకున్న సంచలన నిర్ణయాలు ఇవే..

ముఖ్యాంశాలు

  • జగన్‌ పాలనకు ఏడాది పూర్తి

  • ఎన్నో పథకాలకు శ్రీకారం

  • ఏడాది పాలనలో కీలక నిర్ణయాలు

'నేను విన్నాను.. నేను ఉన్నాను' అన్న నినాదంతో 2019 మే 23న 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లతో అఖండ విజయం సాధించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తవుతోంది. మే 30న విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో భారీ ఎత్తున ప్రమాణ స్వీకారం చేశారు. జగన్‌ పాలన పగ్గాలు చేపట్టిన నాటి నుంచే మెనిఫేస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడమే ధ్యేయంగా ముందుకు సాగారు. ఒక్క ఏడాదిలోనే దాదాను అన్ని హామీలను నెరవేర్చి పాలన పరంగా ముందుకు సాగారు. ఏడాది పాలనలో ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోకుండా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేయడం దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు వైఎస్‌ జగన్‌.

Jagan 1

జగన్‌ ఏడాది పాలనలో తీసుకున్న నిర్ణయాలు

జగన్‌ పాలన చేపట్టిన ఏడాదిలోనే అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అభివృద్ధే ధ్యేయంగా ముందుకు కదిలారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని అడుగుల వేశారు.తక్కువ సమయంలోనే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నాడన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతోంది.

  • ఏపీ ఆర్టీసీ విలీనం
  • పోలీసులకు వీక్లీ ఆఫ్
  • మత్స్యకారుల కోసం వైస్సార్‌ మత్స్యకార భరోసా
  • పేద విద్యార్థుల కోసం జగనన్న అమ్మ ఒడి
  • రైతన్నను ఆదుకునేందుకు వైఎస్సార్‌ రైతు భరోసా
  • పేద వారికి వైద్యసేవలు అందేలా వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ
  • ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు అదేలా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ
  • వృద్ధులకు, వికలాంగులకు వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక
  • మహిళల రక్షణ కోసం దిశ చట్టం
  • విద్యార్థుల కోసం నాడు నేడు
  • పేద విద్యార్థులకు భోజనం
  • వసతి కల్పించేలా జగనన్న దీవెన పథకం
  • దశలవారీగా మద్యం నియంత్రణ
  • పేదలందరికీ ఇళ్లు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్‌ ఇళ్ల పట్టాల పంపిణీ
  • పొదుపు సంఘాల మహిళల కోసం వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం
  • 2020-21 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం
  • మహిళలకు 50శాతం రిజర్వేషన్
  • ప్రాజెక్టుల్లో రివర్స్‌ టెండరింగ్
  • స్పందన కార్యక్రమం ద్వారా అనేక సమస్యల పరిష్కారం
  • రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారి కోసం వైఎస్సార్‌ నవోదయం పథకం
  • రాష్ట్రంలో సీబీఐకి అనుమతి
  • నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని దాదాపు 4 లక్షల ఉద్యోగాల కల్పన
  • సంక్షేమ పథకాల నిర్వహణ కోసం జిల్లాకు ముగ్గురు జాయింట్ కలెక్టర్ల నియామకం
  • అర్చకులు, ఇమామ్‌లు, పాస్టర్లకు రూ. 5వేల ఆర్థిక సాయం

ఇలా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు జగన్‌. జగన్‌ వచ్చాక ఎన్నో పథకాలు, ఎన్నో సమస్యలు పరిష్కారం అయ్యాయని చెప్పుకొంటున్నారు రాష్ట్ర ప్రజలు.

Jagan 2

సుపరిపాలన అందించడానికి విప్లవాత్మక సంస్కరణలకు జగన్‌ శ్రీకారం చుట్టారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసేందుకు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఎన్నో ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో గోదావరి, కృష్ణా, వంశధార, పెన్నా, నాగావళి నదీ జలాలను ఆయకట్టుకు అందించడంలో జగన్‌ ప్రభుత్వం విజయవంతమైంది. ఖరీఫ్ లో కోటి ఎకరాలకు, రబీలో 20 లక్షల ఎకరాలకు నీరు అందించడం వల్ల రికార్డు స్థాయిలో దిగుబడులు రావడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. తొలి ఏడాదిలోనే 39 భారీ, మధ్య తరహా పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించేలా చర్యలు చేపట్టారు జగన్‌. దీంతో 34,822 మందికి ఉపాధి లభించినట్లయింది. గడిచిన ఏడాదిలోనే 13,122 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయి. వీటి వల్ల రూ. 2503 కోట్ల పెట్టుబడులతో 63,897 మందికి ఉద్యోగాలు లభించాయి. జగన్‌ సర్కార్‌ చేపట్టిన ప్రభుత్వ పారదర్శక విధానాల వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు.

Next Story