చేనేత, మత్స్యకారులకు వరాలు ప్రకటించిన సీఎం వైఎస్ జగన్
By న్యూస్మీటర్ తెలుగు Published on 16 Oct 2019 4:10 PM IST- డిసెంబర్ 21 నుంచి 'వైఎస్ఆర్ నేతన్న నేస్తం'
- మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.24వేలు
- వేట నిషేధిత సమయంలో మత్స్యకారులకు రూ.10వేలు
- తెప్పల మీద వేటకు వెళ్లే వారికి కూడా రూ.10వేలు
- మత్స్యకారులకు డీజిల్ పై సబ్పిడీ పెంపు
- నవంబర్ 21 నుంచి పథకం అమలు
- అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్
- ఏపీఎస్ఆర్ ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సులకు స్వస్తి
- ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ
అమరావతి: ఏపీ ప్రభుత్వం నేతన్నలకు తోడుగా ఉంటామని ప్రకటించింది. చేనేతలకు ఏడాదికి రూ.24వేల సాయం పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకానికి "వైఎస్ఆర్ నేతన్న నేస్తం"గా పేరు పెట్టారు. మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి ఈ పథకం కింద ప్రయోజనం చేకూరుతుందని మంత్రివర్గం అభిప్రాయపడింది.అక్టోబర్ నెలాఖరుకల్లా లబ్ధిదారుల రీ వెరిఫికేషన్ పూర్తి చేయనున్నారు. డిసెంబర్ 21 నుంచి "వైఎస్ఆర్ నేతన్న నేస్తం" పథకాన్ని అమలు చేయాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.
వేట నిషేధ మయంలో మత్స్యకార కుటుంబాలకు రూ.10వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెకనైజ్డ్, మోటరైజ్డ్, నాన్ మోటరైజ్డ్ కుటుంబాలకు పథకం వర్తింప చేయనున్నారు. తెప్పలపై కూడా సముద్రంలో చేపల వేటకు వెళ్లే వారికి ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. వేట నిషేధ సమయం ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వరకు సమయంలో ఈ పథకం వర్తింప చేయనున్నారు.
'వైఎస్ఆర్ మత్స్యకారుల వేట నిషేధ సహకారం' కింద ప్రభుత్వం రూ.10వేలు ఇవ్వనుంది. నవంబర్ 21 నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. మత్స్యకారులకు డీజిల్ పై కూడా 50 శాతం సబ్సిడీ ఇచ్చారు. లీటర్ కు రూ.6.03 పైసలు నుంచి రూ.9లకు పెంచారు. గతంతో పోలిస్తే 50శాతం పెంపు. 9 జిల్లాల్లో 51 బంకుల్లో సదుపాయాన్ని కల్పించారు.
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీఏడీ ఆధ్వర్యంలో కార్పొరేషన్కు కేబినెట్ ఓకే తెలిపింది. దీంతో ..అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మరింత లబ్ది చేకూరనుంది. నేరుగా ఉద్యోగుల అకౌంట్లోకే జీతాలు పడే విధంగా నిర్ణయం తీసుకున్నారు. మధ్యవర్తుల ప్రమేయానికి, దోపిడీకి చెక్ పెట్టాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది.
ఇక.. ఏపీఎస్ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సులు స్థానంలో కొత్త బస్సులు తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. దీని కోసం వెయ్యి కోట్లు టర్మ్ లోన్ తీసుకోవడానికి ఆమోదం తెలిపింది.