యువజన సర్వీసులు, పర్యాటకశాఖపై సీఎం జగన్ సమీక్ష
By Medi Samrat Published on 11 Oct 2019 4:08 PM ISTఅమరావతి: తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో యువజన సర్వీసులు, పర్యాటకశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కాగా ఈ సమీక్షలో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు. 15 పర్యాటక ప్రదేశాల్లో వరల్డ్ క్లాస్ హోటల్ప్ వచ్చేలా చర్యలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. నదిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామన్న అవంతి.. బొట్ల ఫిట్నెస్ ఇక్కడ చెక్ చేసిన తర్వాతే అనుమతిస్తామన్నారు. నదిలో బోట్ రవాణాపై కమిటీ త్వరలో నివేదిక ఇవ్వనుందన్నారు.
వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ విశాఖ, విజయవాడ, తిరుపతిలో స్టేడియంల ప్రతిపాదనకు సీఎం జగన్ ఓకే అన్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. క్రీడాకారులకు ప్రోత్సహకాలు, కొండపల్లి పోర్ట్, గాంధీ మ్యూజియం పూర్తి చేయాలన్నారు. త్వరలో ఆర్కియాలజీ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి అవంతి తెలిపారు. సంస్కృతి వికాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, బాషా, సంస్కృతి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. శిల్పారామాలను కోటి రూపాయాలతో మరమ్మత్తులు, అభివృద్ధి చేస్తామన్నారు. ఇడుపులపాయలోనూ శిల్పారామం ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్ పచ్చ జెండా ఊపారని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు.