ప్రాణం తీసిన 'టిక్ టాక్'
By అంజి Published on 3 March 2020 8:18 AM IST
సోషల్ మీడియా యువతకు జ్ఞానాన్ని పెంచి, వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీస్తోందో లేదో తెలియదు కానీ వారిని చెడుదారిలోకి వెళ్లే దిశగా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా కొందరు యువకులు టిక్ టాక్ చేయాలనే నెపంతో ప్రాణాల మీదకు తెచ్చుకుని అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా టిక్ టాక్లో వీడియో పోస్ట్ చేయడానికి ఓ యువకుడు నీటిలో దూకి అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్లో చోటుచేసుకుంది.
రాజ్ ఖురేషీ అని టీనేజర్ ఓ డ్యామ్ వద్ద గట్టుపై నుంచి నీటిలోకి దూకాడు. అయితే లోతు తక్కువగా ఉండడంతో కాంక్రీట్ దిమ్మె తగలి చనిపోయాడు. నీటిలో పడీ పడడం తోనే కనీసం చలనం కూడా లేకుండా ఉండిపోయాడు. ఇదంతా టిక్ టాక్ కోసం అతని స్నేహితుడు తీసిన వీడియోలో రికార్డయింది. రాజ్ ఖురేషీని బతికించడానికి స్నేహితులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. టిక్ టాక్ కోసం ఎవరూ ఎలాంటి సాహసాలూ చేయొద్దని సాక్షాత్తూ ఆ యాప్ వాళ్లే మొత్తుకుంటున్నా ఫలితం ఉండడం లేదు. చైనా కేంద్రంగా పనిచేస్తున్న ఈ యాప్పై సరైన నిఘా లేకపోవడంతో ఎలా నియంత్రించాలో తెలియక పోలీసులు సైతం తలలు పట్టుకుంటున్నారు.