World Cup-23: తలబాదుకున్న కోహ్లీ.. అయ్యో అంటున్న నెటిజన్లు

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఔట్‌ అయ్యాక డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఫ్రెస్టేట్‌ అయ్యాడు. చేతులతో తలబాదుకున్నాడు.

By Srikanth Gundamalla  Published on  9 Oct 2023 4:24 AM GMT
world cup-2023, IND Vs AUS, virat kohli, viral video,

World Cup-23: తలబాదుకున్న కోహ్లీ.. అయ్యో అంటున్న నెటిజన్లు

వన్డే వరల్డ్‌ కప్‌-2023 టోర్నీలో టీమిండియా బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన విషయం తెలిసిందే. సింగిల్‌ డిజిట్‌కే మూడు వికెట్లు పడిపోయినా ఆ తర్వాత విరాట్‌, కేఎల్‌ రాహుల్‌ టీమ్‌ను విజయతీరానికి చేర్చారు. విరాట్‌ కోహ్లీ (116 బంతుల్లో 85; 6 ఫోర్లు)తో పాటు చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడాడు. అటు కేఎల్‌ రాహుల్‌ చివరి వరకు నిలబడి (115 బంతుల్లో 97 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్సర్లు)తో విజయాన్నందించాడు. రాహుల్‌ చివరగా కొట్టిన సిక్స్‌తో టీమిండియా విజయాన్ని అందుకుంది. అయితే.. విరాట్‌ కోహ్లీ మరో సెంచరీ చేస్తాడని అందరూ భావించారు. కానీ.. 85 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు. దాంతో.. అతడి అభిమానులూ నిరాశపడ్డారు.

కాగా.. 200 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ కేవలం 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కోహ్లీ కూడా జట్టు 20 పరుగుల వద్ద ఉండగా క్యాచ్‌ ఇచ్చాడు. కానీ.. ఆ క్యాచ్‌ని మిచెల్‌ మార్ష్‌ వదిలేశాడు. ఆ తప్పిదమే ఆస్ట్రేలియా భారీ మూల్యాన్ని చెల్లించుకునేలా చేసింది. విరాట్, కేఎల్ రాహుల్ కలిసి భారీ స్కోరు చేశారు. ఈ క్రమంలో 75 బంతుల్లో విరాట్‌ కోహ్లీ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 80 పరుగులు దాటగానే విరాట్‌ తన 78వ సెంచరీ సాధించబోతున్నాడని అందరూ భావించారు. కానీ.. అనుకోని విధంగా 85 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో లబుషేన్‌కి క్యాచ్‌ ఇచ్చి విరాట్‌ పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లాక సెంచరీ మిస్‌ చేసుకున్నా అనో లేదంటో.. విజయాన్ని తన చేతులతో అందించలేకపోయాననో కానీ విరాట్‌ బాగా ఫ్రెస్టేట్‌ అయ్యాడు. తన చేతులతో తల బాదుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియోని చూసి అయ్యో కోహ్లీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కొందరైతే బాధపడకు విరాట్‌ మున్ముందు మరిన్ని అవకాశాలు వస్తాయంటూ రాసుకొస్తున్నారు. ఏదేమైనా ఈ మ్యాచ్‌లో సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడారంటూ విరాట్‌ను పొగడుతున్నారు నెటిజన్లు.

కాగా.. విరాట్‌ ఔట్‌ అయ్యిన తర్వాత హార్దిక్‌ పాండ్యాతో కలిసి కేఎల్ రాహుల్‌ టీమిండియాను గెలిపించాడు. 41.2 ఓవర్లలో భారత్ 4 వికెట్లు కోల్పోయి 200 పరుగుల టార్గెట్‌ను చేదించింది. 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన కేఎల్ రాహుల్‌ మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

Next Story