వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఓ వ్యక్తి కలకలం

వరల్డ్ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి కలకలం రేపాడు.

By Srikanth Gundamalla
Published on : 19 Nov 2023 11:04 AM

world cup-2023, australia, india, final match,

వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఓ వ్యక్తి కలకలం

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వరల్డ్ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతోంది. ఈ మ్యాచ్‌ను క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆతృతగా చూస్తున్నారు. స్టేడియంలో లక్షకు పైగా మంది అభిమానులు ఉన్నారు. ఈ సమయంలోనే మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి కలకలం రేపాడు. ఇండియా-ఆస్రేలియా మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో వ్యక్తి గ్రౌండ్‌లోకి దూసుకొచ్చాడు. ఫ్రీ పాలస్తీనా అంటూ టీషర్ట్‌, పాలస్తీనా జెండా రంగులు కలిగిన మాస్క్‌ను ధరించి గ్రౌండ్‌లో వచ్చేశాడు. సెక్యూరిటీ నుంచి తప్పించుకుని పిచ్‌ వద్ద బ్యాటింగ్ చేస్తున్న విరాట్‌ కోహ్లీని కౌగిలించుకునే ప్రయత్నం చేశాడు. ఆ సంఘటన స్టేడియంలో ఒక్కసారిగా కలకలం రేపింది.

ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుండగా గ్రౌండ్‌లోకి దూసుకొచ్చిన వ్యక్తి తెలుపు, ఎరుపు రంగు టీషర్ట్‌ ధరించాడు. పాలస్తీనాపై బాంబింగ్‌ ఆపండి అంటూ ముందు రాసి ఉంది. అలాగే టీషర్ట్‌ వెనకాల ‘ఫ్రీ పాలస్తీనా’ అని ప్రింట్ చేయించుకున్నాడు. నిబంధనలు ఉల్లంఘించి గ్రౌండ్‌లోకి చొచ్చుకుని రావడంతో పోలీసులు వెంటనే స్పందించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాడు. అయితే.. ఆ వ్యక్తి మ్యాచ్‌ జరుగుతున్న సందర్భంగా రావడంతో కాసేపు ఆట నిలిచిపోయింది. అతడిని భద్రతా సిబ్బంది గ్రౌండ్‌ నుంచి బయటకు తీసుకెళ్లగానే యథావిధిగా మ్యాచ్‌ కొనసాగింది. కాగా.. ఇజ్రాయిల్‌-హమాస్‌ మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

Next Story