ఫైన‌ల్‌కు ముందు కోహ్లీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన స‌చిన్‌

2023 వన్డే ప్రపంచకప్‌లో భారత్-ఆస్ట్రేలియా జ‌ట్ల మధ్య అహ్మదాబాద్‌లో ఫైన‌ల్‌ మ్యాచ్ ప్రారంభమైంది.

By Medi Samrat  Published on  19 Nov 2023 9:30 AM GMT
ఫైన‌ల్‌కు ముందు కోహ్లీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన స‌చిన్‌

2023 వన్డే ప్రపంచకప్‌లో భారత్-ఆస్ట్రేలియా జ‌ట్ల మధ్య అహ్మదాబాద్‌లో ఫైన‌ల్‌ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్‌కు దిగింది.

మ్యాచ్‌కు ముందు సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీతో కలిసి మైదానంలో కనిపించాడు. ఇద్దరు దిగ్గజాలు కౌగిలించుకోవడం కూడా చూడ‌వ‌చ్చు. ఆ సమయంలో సచిన్ తన సంతకం చేసిన ప్రత్యేక జెర్సీని విరాట్‌కు అందజేశారు. దీంతో ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీకి క్రికెట్ దేవుడి ఆశీస్సులు లభించాయి. 2011 ప్రపంచకప్ ఫైనల్లో విరాట్, సచిన్ కలిసి టీమ్ ఇండియాలో భాగం కావడం గమనార్హం. 2011 ప్రపంచకప్ విజ‌యం త‌ర్వాత‌ సచిన్ టెండూల్కర్ ను విరాట్ కోహ్లీ తన భుజాలపై మోశాడు. అప్పుడు సచిన్ టెండూల్కర్ ధరించి ఆడిన జెర్సీ ఇదే. ఇప్పుడు విరాట్ కు ఆ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు.

సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా విరాట్ కోహ్లీ.. స‌చిన్‌ 49 వన్డే సెంచరీల రికార్డును బద్దలు కొట్టాడు. త‌ద్వారా వన్డేల్లో 50 సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా విరాట్ నిలిచాడు. అంతర్జాతీయ సెంచరీల పరంగా కూడా సచిన్ తర్వాత విరాట్ రెండో స్థానంలో ఉన్నాడు.

అంతకుముందు సచిన్ టెండూల్కర్ కూడా విరాట్ 49, 50వ సెంచరీల త‌ర్వాత‌ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు. విరాట్‌ 50వ సెంచరీ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో విరాట్‌ను మొదటిసారి కలిసిన సంఘటనను గుర్తుచేసుకున్నాడు. సచిన్‌తో తొలి భేటీలో విరాట్ అత‌డి పాదాలను తాకిన‌ట్లు వెల్ల‌డించాడు.

Next Story