ఏపీలో భారీ వాటర్షెడ్ ప్రాజెక్టు అమలుకు ముందుకు వచ్చిన 'ప్రపంచ బ్యాంకు'
By Newsmeter.Network Published on 27 Nov 2019 4:36 PM ISTముఖ్యాంశాలు
- మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ
- 70 మిలియన్ డాలర్ల రుణం అందించేందుకు సుముఖత
- మొదటి దశ రాయలసీమ, ప్రకాశం జిల్లాలో
ఏపీలో భారీ వాటర్ షెడ్ ప్రాజెక్ట్ అమలుకు ప్రపంచబ్యాంక్ ముందుకు వచ్చింది. ఇప్పటి వరకు దేశంలో ఒడిషా, కర్ణాటకలలో వాటర్ షెడ్ ప్రాజెక్ట్ లో భాగస్వామిగా ఉన్న ప్రపంచబ్యాంక్ తాజాగా ఏపీతో కూడా కలిసి పనిచేసేందుకు ముందడుగు వేసింది. ప్రపంచ బ్యాంక్ నిధులతో దేశంలోనే వాటర్ షెడ్ కార్యక్రమాలను అమలు చేసే మూడో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంపిక చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి ఐదేళ్లపాటు దాదాపు 70 మిలియన్ డాలర్ల మేరకు రుణంగా ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ అంగీకరించింది. ఈ మేరకు బుధవారం అమరావతిలోని సచివాలయంలో ఏడుగురు ప్రపంచబ్యాంక్ ప్రతినిధులతో కూడిన బృందం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖా మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సమావేశమైంది. ఈ సమావేశంలో ఏపీలో వాటర్ షెడ్ ప్రాజెక్ట్ పై బ్యాంక్ ప్రతినిధులతో మంత్రి శ్రీ రామచంద్రారెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. వాటర్ షెడ్ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో నీటియాజమాన్యం, భూసార యాజమాన్యం, మెరుగైన వ్యవసాయ విధానాలు, గ్రామీణ వ్యవసాయరంగ ఆర్థిక అభివృద్ది విధానాలను అమలు చేసే అంశంపై చర్చించారు. వాటర్ షెడ్ ప్రాజెక్ట్ లో 70 శాతం ప్రపంచ బ్యాంక్, 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులను సమకూర్చాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రంలో తక్కువ శాతం వర్షపాతం నమోదవుతున్న రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాను మొదటిదశ వాటర్ షెడ్ అమలుకు ఎంపిక చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.
ఎరువులు, పోషకాల విషయంలో రైతులకు ఉత్తమ సూచనలు:
ఈ ప్రాజెక్ట్ ను రాష్ట్ర గ్రామీణాభివృద్ది, వ్యవసాయ శాఖలు, ఏపీ స్పేస్ అప్లికబుల్ సెంటర్, వ్యవసాయ యూనివర్సిటీల కన్సార్టియం ద్వారా పర్యవేక్షణ చేయాలని, నీటి ఎద్దడితో కూడిన ప్రాంతాల్లో జలవనరులను సంరక్షించడం,ఆధునిక నీటి యాజమాన్య విధానాల ద్వారా నీటి వనరులను సద్వినియోగం చేసుకోవడం ప్రధాన లక్ష్యంగా వాటర్ షెడ్ కార్యక్రమాలు ఉంటాయని ప్రతినిధులు వివరించారు. రాష్ట్రంలో నీటి యాజమాన్యంతో పాటు ఏపీ శాట్ ద్వారా భూసార పరీక్షలు... ఎరువులు, పోషకాల విషయంలో రైతులకు ఉత్తమ సూచనలను అందించడం, వ్యవసాయంలో అవసరం లేని ఎరువులు, పోషకాల వినియోగానికి స్వస్థి చెప్పేలా వారిలో చైతన్యం కలిగించడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.
గ్రామాల్లో ఉపయోగం లేని వ్యవసాయ పెట్టబడి వ్యయాన్ని తగ్గించడం, అధిక ఉత్పత్తులను, మెరుగైన సస్య విధానాలను అందించడం ద్వారా గ్రామీణాభివృద్దికి, పల్లె ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు కూడా వాటర్ షెడ్ ప్రాజెక్ట్ లో చోటు కల్పిస్తున్నట్లు బృందం సభ్యులు వివరించారు. భూసార నివేదికలను, నేల స్వభావాన్ని బట్టి ఏరకమైన పంటలు సాగు, తదితర అంశాలను కూడా వ్యవసాయశాఖ, వ్యవసాయ యూనివర్సిటీల భాగస్వామ్యంతో ఖరారు చేస్తామని వెల్లడించారు. ఈ భేటీలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్, వాటర్ షెడ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకట్ రెడ్డి, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు గ్రాంట్ మిల్నే, లియా విన్యీ, ఎస్ సి రాజశేఖర్, జెవిఆర్ మూర్తి, కస్తురీ బసు, రంజన్ బి వర్మా తదితరులు పాల్గొన్నారు.