మహిళల టీ20 వరల్డ్కప్ : టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన ఆసీస్..
By తోట వంశీ కుమార్ Published on 8 March 2020 8:50 AM GMTమెల్బోర్న్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ముందు ఆసీస్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. తొలి సారి కప్ ముద్దాడాలంటే భారత మహిళల జట్టు 185 పరుగులు చేయాలి.
అంతముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్కు ఆ జట్టు ఓపెనర్లు శుభారంభం అందించారు. అలీసా హీలీ (75; 39బంతుల్లో 7పోర్లు, 5 సిక్సర్లు) బెత్ మూనీ(78; 54బంతుల్లో 10పోర్లు) మొదటి వికెట్కు 11.4ఓవర్లలోనే 115 పరుగులు జోడించారు. ఓవర్కు కనీసం ఒకటి రెండు బౌండరీలు సాధిస్తూనే సింగిల్స్ తీస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.
టీమిండియా పస లేని బౌలింగ్కు తోడు చెత్త ఫీల్డింగ్ ఆసీస్కు కలిసొచ్చింది. హీలికి 9 పరుగుల వద్ద, మూనీలకు 4 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్లను టీమిండియా ఫీల్డర్లు నేలపాలు చేశారు. రాధాయాదవ్ బౌలింగ్లో హీలీ తొలి వికెట్గా అవుటైనా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా బెత్మూనీ మరో ఎండ్ చివరి వరకు నిలబడి ఆసీస్కు భారీ స్కోర్ అందించింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు, పూనమ్ యాదవ్, రాధా యాదవ్ చెరో వికెట్ ను పడగొట్టారు.