వారంరోజులైంది..అది లేక నిద్ర కూడా పట్టట్లేదు..

By రాణి  Published on  28 March 2020 7:03 AM GMT
వారంరోజులైంది..అది లేక నిద్ర కూడా పట్టట్లేదు..

''వారం రోజులైంది..దొరకట్లేదు..అదిలేక రాత్రంతా నిద్ర లేదు ఏమీ లేదు. కళ్లంతా మంటలు వస్తున్నాయి. మాలాంటి వారు ఇంకా నాలుగు రోజులు ఇలాగే ఉంటే పోతారు.అదే అలవాటైపోయింది. రాత్రి పూట అదిలేకపోతే పడుకోలేం. కాళ్లూ, చేతులు నొప్పి వస్తున్నాయి. '' ఈ మాటలు అన్నది నేపాలీ మహిళ. ఈమె చాలా ఏళ్లుగా ఈ దంపతులు ఆంధ్రాలోనే ఉంటున్నారు. ఇంతకీ ఆవిడ మాట్లాడేది దేని గురించో తెలుసా..? అదేనండి మందు. కరోనా తెచ్చిన కష్టం..ఇప్పుడు ఈ మహిళతో పాటు మందుబాబులకు కంటిమీద కునుకు పడకుండా చేస్తోంది.

Also Read : పది పరీక్షలు లేకుండానే ఇంటర్ లోకి..?

కరోనా మహమ్మారి ప్రభావంతో దేశమంతా లాక్ డౌన్ అయింది. నిత్యావసరాలు మినహా అన్నీ మూతపడ్డాయి. వైన్ షాపులు, బార్ షాపులతో సహా. ఇదే ఇప్పుడు చాలా మందికి ఎక్కడ లేని తంటాలు తెచ్చిపెట్టింది. రోజూ కనీసం క్వార్టర్ పడనిదే చాలా మందికి నిద్రపట్టదు. మందుకు అంతలా బానిసలైనవారి సంఖ్య ఎక్కువే. ఇందులో కేవలం మగవాళ్లే ఉన్నారని చెప్పలేం. మందులేకుండా ఉండలేని ఆడవాళ్లు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరు ఈ నేపాలీ మహిళ. '' అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. కానీ దయచేసి మందుషాపులు ఓపెన్ చేయించండి. మా మొగుడు పెళ్లాలం రోజుకు రెండు క్వార్టల్లే తాగేది. అది వేసుకుంటే ఎక్కడలేని ఎనర్జీ, ధైర్యం వస్తాది. మాట్లాడటానికి ఓపిక ఉంటాది. పౌరుషం కూడా దాని వల్లే వస్తాది. ఇప్పుడు అది లేకపోతే ఏమైపోతామో తెలీదు. ఆ కరోనా అనేది బ్రహ్మ రాసిన రాత. అది ఎలా ఉంటాదో ఎవరికీ తెలీదు. బ్రహ్మ అట్టికెల్లేటపుడు ఎలాగ అట్టికెలిపోతాడో తెలీదు. ఆ రోగం వచ్చేటపుడు ఎలాగొస్తాదో తెలీదు. పోయినోడు ఎలా పోతాడో తెలీదు. కానీ ఈ రోగం వచ్చింది, ఆ రోగం వచ్చిందీ..అన్నీ దూషం. అది తప్పు. కానీ మీరు ఎలా ఇస్తే అలా తీసుకుంటాం.'' అని ఓ రిపోర్టతో తన గోడును చెప్పుకుంది.

Also Read : ఉద్యోగులకు మోదీస‌ర్కార్‌ బంఫ‌ర్ ఆఫ‌ర్‌.. జీతం రూ.5,500 పెంపు..

అదేదో సినిమాలో మోస్ట్ ట్యాక్స్ పేయర్స్ మా మందు బాబులే అని చెప్పినట్లు..ఇప్పుడు వైన్ షాపులు బంద్ చేయడం వల్ల ప్రభుత్వాదాయానికి కూడా గండిపడినట్లే. అన్ని ఉద్యోగ సంస్థలు, వ్యాపార సంస్థలు మూత పడిన వేళ వైన్లకు, బార్ షాపులకు ఉండే గిరాకీ అంతా ఇంతా కాదు. కానీ ప్రజలు బ్రతికి ఉండాలంటే ఇలాంటి చర్యలు తీసుకోక తప్పదు. ఎందుకంటే కరోనా సోకకుండా ఉండాలంటే..ప్రజలు ఒకరినొకరు కలవకూడదనేది కనీస నియమం. ఇలాంటి సమయంలో మందు షాపులు తెరిస్తే..వందలాదిమంది షాపులకు క్యూ కడతారు. వారిలో ఏ ఒక్కరికి కరోనా ఉన్నా అది దేశమంతా పాకిపోయే ప్రమాదం ఉంది. అందుకే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇలాంటి కఠిన నిర్ణయాలను అమలు చేయాల్సి వచ్చింది. మందుకు బానిసైన వారు కూడా ఈ పరిస్థితిని అర్థం చేసుకుని..కొద్దికాలంపాటు మిన్నకుండటం అందరికీ శ్రేయస్కరం.

Next Story