భార్యను ఏడాది పాటు బాత్‌రూంలో బంధించి, తిండి పెట్టకుండా హింసలు

By సుభాష్  Published on  15 Oct 2020 8:16 AM GMT
భార్యను ఏడాది పాటు బాత్‌రూంలో బంధించి, తిండి పెట్టకుండా హింసలు

హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను ఏడాదిపాటు బాత్‌రూమ్‌లో బంధించి నానా హింసలు పెట్టిన భర్త ఉదాంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన హర్యానాలోని పానిపట్‌ జిల్లా రిష్పూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, మహిళ, శిశు సంరక్షణ అధికారులకు సమాచారం అందించడంతో ఆమెను భర్త బారి నుంచి రక్షించారు. ఏడాది పాటు మరుగుదొడ్డిలో బంధీగా ఉన్న ఆమె పరిస్థితి చూసి అధికారులు సైతం చలించిపోయారు.

బలహీనంగా ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భర్త పెట్టిన హింసల గురించి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఐపీసీ సె క్షన్‌ 498ఏ, 342 కింద కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా మహిళ శిక్ష సంక్షేమ అధికారిణి రజనీ గుప్తా మాట్లాడుతూ.. నిందితుడు నరేష్‌ కుమార్‌తో సదరు మహిళకు 17 సంవత్సరాల కిందట వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు. ఒక మహిళను టాయిలెట్‌లో ఏడాదిపాటు బంధించినట్లు మాకు సమాచారం అందింది. మా బృందంతో కలిసి వెంటనే ఇక్కడకు చేరుకున్నాం. ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చాలా రోజుల నుంచి సరైన తిండి కూడా లేనట్లు కనిపించింది అని తెలిపారు.

ఇదీ చదవండి: హైదరాబాద్‌లో భూకంపం.. పరుగులు తీసిన జనాలు..!

ఈ విషయమై భర్తను ప్రశ్నించగా, భార్య మానసిక స్థితి సరిగా లేదని, ఆమె టాయిలెట్‌ నుంచి ఎప్పుడు బయటకు రాదని కట్టు కథలు చెప్పాడని, కానీ అది వాస్తవం కాదని మాకు అర్థమైంది. ఆమె మానసిక పరిస్థితి బాగానే ఉందని అధికారిణి తెలిపారు. ఆమె మొత్తం ఆస్తి పంజరంలా మారిపోయిందన్నారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆమె బాగానే సమాధానం చెబుతున్నారని, ఆమెను చిత్ర హింసలకు గురి చేసినట్లు తెలుస్తోందని అన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.



Next Story