భూ సంబంధిత వివాదాలు, పైసల పంచాయతీలు ఇక్కడ పరిష్కరించబడవు.. కోర్టుల్లో పరిష్కరించుకోవాలి అని చెబుతూనే భూ వివాదాల్లో కొందరు పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. తాజాగా హన్మకొండలో భూ వివాదం విషయంలో ఓ కుటుంబంపై పోలీసులు రెచ్చిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హన్మకొండలోని పెద్దమ్మ గడ్డలో నిర్మల (62), యేసునాథం (66) నివాసం ఉంటున్నారు. అయితే తమను కొన్ని రోజులుగా భూ వివాదం విషయంలో పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. తాము 1992లో సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసిన భూమిలో మున్సిపాలిటీ నిబంధనల ప్రకారం ఇల్లు కట్టుకుని ఉంటున్నామని, అయితే కొంతమంది కావాలనే తమపై తప్పుడు ఫిర్యాదులు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు ఆరోపించారు.
దీనిపై పోలీస్స్టేషన్కు వచ్చిన వివరణ ఇచ్చిన తర్వాత కూడా మమ్మల్ని పదేపదే పోలీస్స్టేషన్కు రావాలని పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఫిర్యాదుదారుడికి మీ స్థలం నుంచి బాట ఇవ్వాల్సిందేనని, లేదంటే మీపై కేసు పెట్టి జైలుకు పంపుతామని పోలీసులు భయబ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు తెలిపారు. ఇదే విషయమై తాము ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తమది ఏదైనా తప్పు ఉంటే కోర్టులో చూసుకుంటామని చెప్పినా కూడా వినిపించుకోకుండా పదే పదే పోలీస్స్టేషన్కు రావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నాడు ఏకంగా పోలీసులు ఇంట్లోకి దూసుకొచ్చారని, ఇల్లంతా వెతికారని, ఇంట్లో లేడీస్ ఉన్నారని చెప్పినా వినిపించుకోలేదన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులు స్పందించి తమకు వెంటనే న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.