పగబట్టినట్లుగా రైతు వెంటే పడిన ఎద్దు.. చెట్టుపైకి ఎక్కినా..

ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఓ ఎద్దు దారి తప్పింది. ఓ రైతుపై పగబట్టినట్లుగా అతని వెంటే పడింది.

By Srikanth Gundamalla  Published on  31 July 2023 2:55 AM GMT
Uttar Pradesh, Bull, Try To Attack, Farmer,

పగబట్టినట్లుగా రైతు వెంటే పడిన ఎద్దు.. చెట్టుపైకి ఎక్కినా...

పశువులు తమ యజమానులను గుర్తుపడతాయి. వారు తప్ప మిగతా వారు దగ్గరకి వస్తే దాడి చేసేందుకు కూడా వెనకాడవు. అయితే.. కొన్ని పశువులు మాత్రమే ఇలా ఉంటాయి. ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఓ ఎద్దు దారి తప్పింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ.. ఓ రైతుపై పగబట్టినట్లుగా అతని వెంటే పడింది. భయపడిపోయిన సదురు రైతు చెట్టు ఎక్కాడు. అయినా కూడా వదలకుండా అక్కడే నిలబడింది. చెట్టుదిగకుండా ఎక్కడికి పోతావు అన్నట్లుగా.. అక్కడే నిలబడి బెదిరించింది. అటుగా వెళ్తున్న కొందరు ఈ దృశ్యాలను వీడియో తీశారు. ఆ తర్వాత సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. ప్రస్తుతం ఇదే వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బలియా జిల్లాలో చోటుచేసుకుంది ఈ సంఘటన. రస్డా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారి తప్పిన ఓ ఎద్దు పలుగ్రామాల్లో తిరుగుతోంది. కనబడిన వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. అలా దాదాపు 12 మంది గాయపడినట్లు తెలుస్తోంది. అయితే..గత శుక్రవారం కూడా ఓ రైతుపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. అతని వెంట పడింది. భయపడిపోయిన ఖఖ్ను అనే రైతు పరుగు తీశాడు. అయినా వదలకుండా వెంటనే పరిగెత్తింది. అతడు ఎద్దు నుంచి తప్పించుకునేందుకు పొలాల దగ్గర ఉన్న ఓ చెట్టు ఎక్కాడు. దాంతో.. ఎద్దు తిరిగి వెళ్లిపోతుందని భావించాడు. కానీ ఆ ఎద్దు అతడిపై పగబట్టినట్లుగా వ్యవహరించింది. అక్కడే నిలబడింది. కిందికి దిగవా.. దిగకుండా ఉంటావా..దిగగానే దాడి చేస్తా అన్నట్లుగా కాలు దువ్వింది. బెదిరించింది. అలా దాదాపు 2 గంటల పాటు రైతు చెట్టుపైనే ఉండిపోయాడు.

కాగా.. అటుగా వెళ్తున్న కొందరు ఈ దృశ్యాన్ని వీడియో తీశారు. ఆ తర్వాత సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయగా అది తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటనపై రాజకీయ నేత అఖిలేష్‌ కూడా స్పందించారు. ఇలా దాడులు చేస్తున్న ఎడ్లను అరికట్టేందుకు బుల్‌ ప్రొటెక్షన్‌ పోలీసులను ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రాంతంలో ఇలా దారి తప్పిన ఎద్దులు దాదాపు 3వేలకు పైగా ఉన్నాయట. వాటిని సంరక్షణ కేంద్రాలకు తరలించినట్లు చెప్పారు. ప్రస్తుతం దారి తప్పి భయాందోళనకు గురి చేస్తోన్న ఎద్దుని కూడా పట్టుకునేందుకు ఓ బృందం రంగంలోకి దిగినట్లు సమాచారం.

Next Story