హింసాత్మకంగా మారిన ప్రీవెడ్డింగ్‌ షూట్‌.. ఫొటోగ్రాఫర్లపై స్థానికుల దాడి.. గుడిలోకి బూట్లు ధరించి వెళ్లారని..

కర్నాటకలోని సకలేశ్‌పుర తాలూకాలోని మారగుండ గ్రామంలో ఉన్న భైరవేశ్వర ఆలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒక ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ సందర్భంగా...

By -  అంజి
Published on : 29 March 2026 7:29 AM IST

Temple Conflict, Sakleshpur Violence, Pre-wedding Photoshoot Controversy, Bhairaveshwara Temple, Photographers Protest, Religious Sanctity, Hassan District News

హింసాత్మకంగా మారిన ప్రీవెడ్డింగ్‌ షూట్‌.. ఫొటోగ్రాఫర్లపై స్థానికుల దాడి.. గుడిలోకి బూట్లు ధరించి వెళ్లారని..

కర్నాటకలోని సకలేశ్‌పుర తాలూకాలోని మారగుండ గ్రామంలో ఉన్న భైరవేశ్వర ఆలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒక ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ సందర్భంగా ఆలయ లోపల షూ ధరించి వెళ్లారనే కారణంతో స్థానికులు ఫోటోగ్రాఫర్లపై దాడికి దిగారు. ఈ ఘటనలో నలుగురు నుంచి ఐదుగురు ఫోటోగ్రాఫర్లు గాయపడగా, వారిని తాలూకా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఎటువంటి కారణం లేకుండానే తమపై దాడి చేశారని, కెమెరాలు, మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారని ఫోటోగ్రాఫర్లు ఆరోపిస్తున్నారు.

మరోవైపు, ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నారని స్థానికులు వాదిస్తున్నారు. పర్యాటక కార్యకలాపాలు, ప్రీ-వెడ్డింగ్ షూట్‌ల వల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా డ్రెస్ కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ పుణ్యక్షేత్రాన్ని మతపరమైన కేంద్రంగా రక్షించాలని అధికారులను కోరారు. ఈ ఘటనపై గాయపడిన ఫోటోగ్రాఫర్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయలేదని ఆరోపిస్తూ వందలాది మంది ఫోటోగ్రాఫర్లు సకలేశ్‌పుర రూరల్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు.

ఈ నిరసన కాస్తా ముదిరి ఫోటోగ్రాఫర్లు, స్థానికుల మధ్య వాగ్వాదం, తోపులాటలకు దారితీసింది. పోలీస్ స్టేషన్ ముందే హైడ్రామా నడవడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని హసన్ జిల్లా ఫోటోగ్రాఫర్ల సంఘం డిమాండ్ చేసింది. పరస్పర ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ ప్రారంభించారు.

Next Story