'విక్రమ్'తో కమ్యూనికేషన్ కష్టమేనా?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Sep 2019 12:17 PM GMT
విక్రమ్తో కమ్యూనికేషన్ కష్టమేనా?

  • విక్రమ్ కోసం ఇస్రో అలుపెరగని ప్రయత్నాలు
  • విక్రమ్ కోసం నాసా కూడా తీవ్ర ప్రయత్నాలు
  • విక్రమ్ కోసం స్కాట్ టిల్లే బృందం కూడా ప్రయత్నాలు
  • గడువు తీరిన అన్వేషణ సాగే అవకాశం
  • సెప్టెంబర్ 21 వరకే డెడ్ లైన్

ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ చంద్రయాన్ -2. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల దూరంలో సంకేతాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. 'విక్రమ్' ల్యాండర్ ఆచూకీని కూడా ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే.. ల్యాండర్ తో సిగ్నల్స్ ను కనుక్కునేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నారు. చంద్రుడికి సౌత్ పోల్ లో నిర్దేశించిన ప్రాంతానికి కొన్ని మీటర్ల దూరంలో 'విక్రమ్' హార్డ్ ల్యాండింగ్ అయింది. ల్యాండర్ పక్కకు వంగినట్టు ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు.

తాజాగా, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సైతం 'విక్రమ్‌'ను కనుగొనేందుకు యత్నిస్తోంది. రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా విక్రమ్‌తో సిగ్నల్స్ పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, ఇస్రో అంగీకారంతోనే డీప్ స్పేస్ నెట్‌వర్క్ సిస్టం ద్వారా తన వంతు ప్రయత్నం చేస్తోంది నాసా.

'విక్రమ్‌'తో కమ్యూనికేషన్ పునరుద్ధరించాలని ఇస్రో పట్టుదలగా ఉన్నా ఆశలు మాత్రం రోజురోజుకు సన్నగిల్లుతున్నాయి. చంద్రుడిపై ఒక్క రోజు (అంటే మనకు 14 రోజులు) మనుగడ సాగించేలా రోవర్‌ను రూపొందించారు. చంద్రుడి ఉపరితలంపై సూర్యకిరణాల సాయంతో విద్యుత్‌ను తయారుచేసుకునేలా రోవర్‌ను డిజైన్ చేశారు.రోవర్‌కు ఏర్పాటు చేసిన సోలార్ ప్యానల్స్ సెప్టెంబర్‌ 21 వరకు మాత్రమే పనిచేస్తాయి. ఈ లోపల ల్యాండర్ తో సిగ్నల్స్ పునరుద్ధరణ జరుగుతుందా? లేదా? అనేది ప్రస్తుతానికి సస్పెన్సే.

2005లో నాసా ప్రయోగించిన స్పై శాటిలైట్ ఇమేజింగ్ భూ కేంద్రంతో సంబంధాలు నిలిచిపోయాయి. అయితే..దానిని గుర్తించడంలో శాస్త్రవేత్త టిల్లే విజయం సాధించారు. దీంతో ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. విక్రమ్‌ ల్యాండర్‌తో కూడా సంబంధాలు పునరుద్దరించడానికి టిల్లే ఆధ్వర్యంలోని డిఎస్‌ఎన్‌ విభాగాలు తీవ్రంగా కృషి చేస్తుంది.

Next Story