అల‌ర్ట్ : న‌గ‌రంలో ట్రాఫిక్ ఆంక్షలు

Traffic diverted in Vijayawada city.బెంజిసర్కిల్‌ ఫ్లైఓవర్‌-2 ప్రారంభోత్సవం మ‌రియు ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో

By Medi Samrat  Published on  17 Feb 2022 5:27 AM GMT
అల‌ర్ట్ : న‌గ‌రంలో ట్రాఫిక్ ఆంక్షలు

బెంజిసర్కిల్‌ ఫ్లైఓవర్‌-2 ప్రారంభోత్సవం మ‌రియు ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో గురువారం నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ టీకే రాణా తెలిపారు. కొత్తగా నిర్మించిన ఫ్లై ఓవర్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో కలిసి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రారంభించనున్నారు. అనంతరం స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నేతలు ప్రసంగించ‌నున్నారు. ఈ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. ఆంక్షలు ఎత్తివేసే వరకు బందరు రోడ్డుపై వాహనాలను అనుమతించబోమని స్పష్టం చేశారు.

విధించిన ట్రాఫిక్ ఆంక్షల ప్రకారం.. చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్లే లారీలు, భారీ వాహనాలు ఒంగోలు, త్రోవగుంట, చీరాల, బాపట్ల, రేపల్లె, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్‌ జంక్షన్ల మీదుగా వెళ్లాల‌ని సూచించారు. చెన్నై నుంచి హైదరాబాద్‌కు వెళ్లే భారీ వాహనాలు మేదరమెట్ల, పిడుగురాళ్ల, దాచేపల్లి, నకిరేకల్ మీదుగా.. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్లే లారీలు, భారీ వాహనాలు హనుమాన్ జంక్షన్, నూజివీడు, మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మీదుగా వెళ్లాల్సి ఉంటుందని పోలీసు కమిషనర్ తెలిపారు.

గుంటూరు నుంచి విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌కు వెళ్లే కార్లు, ఇతర వాహనాలను కనకదుర్గ ఫ్లైఓవర్‌పైకి అనుమతిస్తారు. ఈ వాహనాలు ప్రకాశం బ్యారేజీ మీదుగా నగరానికి చేరుకుని అక్కడి నుంచి హైవేపై హైదరాబాద్, ఏలూరు రోడ్డు నుంచి రామవరప్పాడు మీదుగా విశాఖపట్నం చేరుకుంటాయి. ఏలూరు నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వైపు వచ్చే వాహనాలు రామవరప్పాడు రింగ్ రోడ్డు, ఏలూరు రోడ్డు, పోలీస్ కంట్రోల్ మీదుగా వెళ్లాలి. పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి మచిలీపట్నం వెళ్లే వాహనాలు ఏలూరు రోడ్డు, రామవరప్పాడు రింగ్ రోడ్డు, ఎనికేపాడు, తాడిగడప 100 అడుగుల రోడ్డు మీదుగా వెళ్లాలి.

బెంజిసర్కిల్‌ నుంచి బందర్‌రోడ్డు మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లే సిటీ బస్సులను రమేష్‌ ఆస్పత్రి, రామవరప్పాడు రింగ్‌రోడ్డు, ఏలూరు రోడ్డు, పోలీస్‌ కంట్రోల్‌ రూట్‌ రూట్‌ మీదుగా మళ్లిస్తారు. నూతన ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ టీకే రాణా కోరారు.

Next Story