యూపీ స్కూళ్లో దారుణం.. 81 మందికి కేవలం లీటర్ పాలు మాత్రమే..!
By Newsmeter.Network
లక్నో : ప్రభుత్వ పాఠశాలలు అంటేనే చదువుతో పాటు.. మధ్యాహ్న భోజనం కూడా పెడుతారని మనకు తెలుసు. ఈ నేపథ్యంలోనే చాలా మంది నిరుపేదలు ప్రభుత్వ పాఠశాలలపై ఆశపడుతారు. కానీ.. కేవలం లీటర్ పాలలో బకెట్ నీళ్లు పోసీ 81 మందికి ఇవ్వడం యూపీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. అయితే దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
అయితే ఉత్తరప్రదేశ్లోని సోనభద్ర జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు పాలు పంపిణీ చేస్తున్నారు. ఆ సమయంలో గ్రామ పంచాయతీ సభ్యుడు ఒకరు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో పెద్ద అల్యూమినియం పాత్రలో వేడి నీళ్లలో లీటరు పాలు కలిపి దాదాపు 81 మంది పిల్లలకు ఇవ్వడాన్ని గమనించారు. ఆ తతంగాన్ని అంతా వీడియో తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
అయితే ఈ ఘటనపై స్పందించిన అధికారులు మాత్రం.. తమ వద్ద పాలు పంపిణీ చేయడానికి గేదెలు, ఆవులు లేవని పేర్కొన్నారు. పాల ప్యాకెట్ల సరఫరా ఆలస్యమైన కారణంగానే ఈ తప్పిదం జరిగినట్లు అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా అదే రోజు మళ్లీ పిల్లలందరికీ సరిపడా పాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. కాగా రెండు నెలల క్రితం యూపీలోని మీర్జాపూర్లో గల ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇదే తరహా ఘటన జరిగిన విషయం తెలిసిందే.