మొదలైన అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Nov 2020 9:04 AM GMT
మొదలైన అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. భారత కాలమాన ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 1 గంటలకు ఓటింగ్‌ ప్రక్రియ మొదలైంది. అమెరికాలోని న్యూ హాంప్‌షైర్‌లో తొలి ఓటు నమోదైంది. కరోనా నేపథ్యంలో క‌ట్టుదిట్ట‌మైన‌ జాగ్రత్తల నడుమ పోలింగ్ జ‌రుగుతుంది.

కాగ‌, అమెరికాలో మొత్తం 23.9 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటికే ముందస్తు ఓటింగ్‌లో సగం ఓట్లు పోలైయ్యాయి. దాదాపు 10 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. హవాయ్‌, టెక్సాస్‌, మోంటానా రాష్ట్రాల్లో భారీగా ముందస్తు ఓట్లు పోలైయ్యాయి. ఈ పోస్టల్‌ ఓట్లపై రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర అసంతృప్తి, అనుమానం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే.. భారత ఎన్నికలకు, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పొంతన లేదు. భారత్ ఎన్నికల్లో ప్రజలు ఎక్కువ ఓట్లు ఎవరికి వేస్తే వారిదే విజయం! కానీ.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అలా కాదు!! ప్రజల ఓట్లు ఎన్నొచ్చాయన్నది కాదు లెక్క.. ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు ఎన్నొచ్చాయన్నదే లెక్క. అందుకే.. 2016 ఎన్నికల్లో ట్రంపు కన్నా హిల్లరీకి 28.68 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చినా.. ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు ఎక్కువగా దక్కించుకున్న ట్రంపే అధ్యక్ష్యుడు అయ్యాడు.

Next Story